బిర్యానీని మించిన రుచితో మటన్ కీమా రైస్.. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు!

Posted By:

మటన్ కీమాతో చేసే వంటకాలు అంటే చాలామంది నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమే. సాధారణంగా మనం ఇంట్లో కీమా కర్రీ, కీమా బిర్యానీ లేదా కీమా ఫ్రై చేసుకుంటూ ఉంటాం. కానీ తక్కువ సమయంలో, ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో చేసుకునే రెసిపీ మటన్ కీమా రైస్. లంచ్ బాక్స్‌ లోకి తీసుకెళ్లడానికైనా, వీకెండ్‌ లో స్పెషల్‌ గా లాగించేయడానికైనా ఈ కీమా రైస్ పర్ఫెక్ట్ ఆప్షన్. మసాలాల ఘాటు, కీమా రుచి అన్నానికి పట్టి తింటుంటే అమృతంలా అనిపిస్తుంది. వంట రాని వారు కూడా సులభంగా చేసుకోగలిగే ఈ మటన్ కీమా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, వండే విధానం ఇక్కడ చూడండి.

Mutton Keema Rice The Ultimate Quick and Easy Non Veg Recipe in Telugu

మటన్ కీమా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

జీలకర్ర - 1 టీస్పూన్

ఆవాలు - 1 టీస్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉల్లిపాయ - 1
మటన్ కీమా (మిన్స్డ్ మీట్) - తగినంత
నీళ్లు - అర కప్పు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉడికించిన అన్నం (బాస్మతీ లేదా సోనా మసూరి) - తగినంత
కొత్తిమీర - కొద్దిగా

మటన్ కీమా రైస్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్ లేదా కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

-ఆవాలు వేగిన తర్వాత, సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఈ వెల్లుల్లి నూనెలో వేగుతుంటే వచ్చే సువాసన కీమా రైస్‌ కు అదనపు రుచిని ఇస్తుంది. ఆ తర్వాత తరిగిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి.. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి.

-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను అందులో వేయాలి. కీమా రంగు మారే వరకు నూనెలో ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల కీమాలోని పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి.. మసాలాలన్నీ కీమాకు బాగా పట్టేలా కలపాలి.

-మసాలాలు కాస్త వేగాక, అందులో అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి కీమాను మెత్తగా ఉడకనివ్వాలి. నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

-కీమా పర్ఫెక్ట్‌ గా ఉడికిన తర్వాత, ముందుగా ఉడికించి, పొడిపొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేయాలి. కీమా, మసాలాలు మొత్తం అన్నానికి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి.

-అన్నం బాగా వేడెక్కిన తర్వాత, చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే గుమగుమలాడే వేడి వేడి మటన్ కీమా రైస్ రెడీ. దీనిని ఉల్లిపాయ రైతాతో కానీ, మిర్చీ కా సాలన్‌ తో కానీ కలిపి తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, May 20, 2026, 11:23 [IST]
Desktop Bottom Promotion