షుగర్‌ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

దక్షిణ భారతీయుల ఇళ్లలో దోశకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సెట్ దోశ నుండి మసాలా దోశ, ఉల్లిపాయ దోశ, రవ్వ దోశ, నీర్ దోశ వరకు ఎన్నో రకాలు ప్రతిరోజూ మన ఇళ్లలో సందడి చేస్తుంటాయి. బియ్యంతో చేసే ఈ దోశలు రుచికి అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం, ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి కొంచెం అడ్డంకిగానే మారతాయి.

రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన ప్రత్యామ్నాయం రాగి దోశ. రాగులు పోషకాల గని. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం), క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. రాగి దోశ ఇంట్లో చేస్తే చాలా మందంగా, ముద్దగా వస్తుందని చాలామంది అంటుంటారు. రెస్టారెంట్ స్టైల్ లో కరకరలాడే, కాగితం లాంటి పలుచటి రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Paper Thin Crispy Ragi Dosa Recipe in Telugu Ultimate Healthy Breakfast

రాగి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - 1 కప్పు

బొంబాయి రవ్వ- అర కప్పు
మైదా లేదా గోధుమ పిండి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - దోశ కాల్చడానికి
నీళ్లు - తగినంత
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర -కొద్దిగా

రాగి దోశ తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, రెండు చెంచాల మైదా పిండి వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి.

-మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరిన్ని నీళ్లు పోసి పిండిని చాలా పలుచగా, నీళ్లలాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ పలుచటి పిండిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా జీలకర్ర వేసి బాగా కలిపి మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

-15 నిమిషాల తర్వాత పిండిని అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత సగం కట్ చేసిన ఉల్లిపాయను నూనెలో అద్ది పెనం అంతా రుద్దండి. ఇలా చేస్తే దోశ పెనానికి అతుక్కోకుండా సులభంగా వస్తుంది.

-మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి, గిన్నెతో పిండిని తీసుకుని బయటి అంచుల నుండి మధ్యలోకి పోయాలి. గరిటెతో మామూలు దోశలా అస్సలు రుద్దకూడదు. పైనుండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకోవచ్చు. చుట్టూ కొద్దిగా నూనె వేసి, దోశ ఎర్రగా కరకరలాడేలా ఉడికించి పక్కకు తీసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కాగితం లాంటి సన్నటి కరకరలాడే రాగి దోశ నిమిషాల్లో రెడీ. పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లేదా వేడివేడి సాంబార్‌ తో కలిపి తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, March 7, 2026, 7:17 [IST]
Desktop Bottom Promotion