ఎండుమిర్చి సాంబార్..ఒక్క ముద్ద తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు!

Posted By:

తీరిక లేని సమయాల్లో లేదా ఇంట్లో కూరగాయలు నిండుకున్నప్పుడు ఈరోజు వంట ఏం చేయాలి? అనే చింత ప్రతి గృహిణికి ఉంటుంది. కూరగాయలు లేకపోయినా ఉన్నవాటితోనే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే ఎండుమిర్చి సాంబార్‌ ను చిటికెలో తయారు చేసుకోవచ్చు.

ఎండుమిర్చి సాంబార్ కేవలం వేడి వేడి అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోసె, వడ వంటి టిఫిన్లలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుని, కాస్త నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలవు. కేవలం 10 నిమిషాల్లో ఈ స్పెషల్ సాంబార్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పప్పు ఉడికించడానికి:
కందిపప్పు లేదా ఎర్ర కందిపప్పు- ముప్పావు కప్పు
నీళ్లు - 3 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 4
పెద్ద టమోటా - 1
ఇంగువ - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
నూనె - రెండున్నర టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 6 (గింజలు తీసేయండి)
కరివేపాకు - 1 రెమ్మ
సాంబార్ ఉల్లిపాయలు- 12
పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
సాంబార్ పొడి - 2 టీస్పూన్లు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు నీటిలో నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి నానబెట్టాలి.

-తర్వాత కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి కుక్కర్‌ లో వేసుకోవాలి. అందులో 3 కప్పుల నీళ్లు పోసి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, చిటికెడు ఇంగువ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.

-ఆవిరి పోయాక మూత తీసి పప్పు గుత్తితో లేదా గరిటెతో పప్పును మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె లేదా కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత గింజలు తీసేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.

-ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు, తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించండి.

-ఉల్లిపాయలు వేగాక, ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని తాలింపులో పోయాలి. మీకు సాంబార్ ఎంత పల్చగా కావాలో దానికి తగ్గట్టుగా మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా కలపాలి.

-చివరగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని సాంబార్‌ లో పోయాలి. మంటను మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాల పాటు సాంబార్‌ ను బాగా మరిగించాలి.

-సాంబార్ బాగా మరిగి, ఇల్లంతా గుమగుమలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోండి. అంతే ఎంతో రుచికరమైన, కమ్మని సాంబార్ రెడీ.

-వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ సాంబార్‌ తో తింటే స్వర్గంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, December 3, 2025, 11:41 [IST]
Desktop Bottom Promotion