సోయా కరివేపాకు రైస్..లంచ్ బాక్స్‌ కి పర్ఫెక్ట్ హెల్తీ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

భారతీయ వంటకాల్లో అన్నం ఒక ముఖ్యమైన భాగం. మనం రోజూ తినే అన్నాన్ని కాస్త భిన్నంగా, రుచికరంగా, పోషక విలువలతో నిండిన వంటకంగా మార్చుకోవచ్చు. అటువంటి వాటిలో సోయా కరివేపాకు రైస్ ఒకటి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తూ పోషకాలను సమృద్ధిగా కలిగిన అద్భుతమైన వంటకం. సోయా కరివేపాకు రైస్ లంచ్ బాక్సుల్లోకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనిని తయారుచేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. తక్కువ సమయంలోనే మీ ఇంట్లోనే చాలా ఈజీగా సోయా కరివేపాకు రైస్ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

సోయా కరివేపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-సోయా చంక్స్ లేదా సోయా గ్రాన్యుయల్స్
-పల్లీలు
-కరివేపాకు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-మిరియాలు
-మెంతులు
-ధనియాలు
-వండిన అన్నం
-ఉప్పు
-నువ్వులు
-ఎండు కొబ్బరి
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-పచ్చి శెనగపప్పు
-నెయ్యి లేదా ఆయిల
-ఇంగువ

తయారీ విధానం

-ముందుగా ఓ గిన్నెలో అర కప్పు సోయా గ్రాన్యుయల్స్ వేసి అందులో వేడి నీరు పోసి కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సోయా గ్యాన్యుయల్స్ లేకుంటే సోయా చంక్స్ వేసి వేడి నీళ్లలో నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.

-తర్వాత 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కడిగిన బియ్యం,2 కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. అన్నం వండుకున్నట్లు వండుకోవాలి.

-తర్వాత వెడల్పాటి ప్లేట్ లో లేదా బౌల్ లో రైస్ ని పోస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది.

-ఇప్పుడు కరివేపాకు పొడి తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ జీలకర్ర, 4ఎండుమిర్చి, 1 టీస్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి తక్కువ మంట మీద పల్లీలు చిట్లేదాకా వేయించాలి.

-ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రెండున్నర టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించుకోండి.

-నువ్వులు చిట్లుతున్నప్పుడు అందులో 4-5 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆపి చల్లారనివ్వాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో ఈ మొత్తం వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చెయ్యండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీస్పూన్ మినపప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించండి. ఈ తాళింపు కొంచెం వేగాక ఇందులో దంచిన 7 వెల్లుల్లి రెబ్బలు, 2 చీరిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు,చిటికెడు ఇంగువ వేసి వేయించండి.

-ఇప్పుడు తాళింపుతో నానిన సోయా వేసి 2 నిమిషాలు కలుపుకోండి. తర్వాత ఇందులో వండిన అన్నం, మిక్సీలో పట్టించిన కరివేపాకు పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. దించేముందు దాంట్లో కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతే సోయా కరివేపాకు రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, June 17, 2025, 9:41 [IST]
Desktop Bottom Promotion