హోటల్ రుచిని మించే వేరుశెనగ చట్నీ రహస్యం ఇదే!..2 ఇడ్లీలు ఎక్కువే తింటారు

Posted By:

మన ఇళ్లలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేవి వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే దోశెలు. వీటికి అసలైన రుచిని, ప్రాణాన్ని ఇచ్చేది పక్కనే ఉండే చట్నీ. రోజూ అవే కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ చేసి చేసి మీకూ, తినేవాళ్లకూ బోర్ కొట్టిందా? ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వేరుశెనగ చట్నీని మీరు ఎప్పుడూ ఒకేలా చేస్తున్నారా?

అయితే ఆ పాత పద్ధతికి కొంచెం విరామం ఇచ్చి చిన్న మార్పులతో వేరుశెనగ చట్నీని ఒక్కసారి చేసి చూడండి. దాని ఘుమఘుమలాడే వాసనకే ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరవుతారు. ఇక రుచి చూశాక మామూలుగా రెండు ఇడ్లీలు తినేవాళ్లు కూడా మరో రెండు అడగక మానరు. ఈ అద్భుతమైన వేరుశెనగ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Restaurant Style Peanut Chutney at Home A Taste of Perfection

కావలసిన పదార్థాలు
పచ్చి వేరుశెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
పండు టమోటా - 1
వెల్లుల్లి రెబ్బలు - 4-5
తాజా కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - చిన్న కట్ట
ఎండు మిరపకాయలు - 2
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
ఎండు మిరపకాయ - 1

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో రెండు టీస్పూన్ల నూనె వేయండి. నూనె కొద్దిగా వేడెక్కగానే మంటను తగ్గించి వేరుశెనగపప్పు వేసి దోరగా, కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి.

-వేరుశెనగపప్పు చక్కగా వేగాక, అందులోనే తరిగిన టమోటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి టమోటా మెత్తబడే వరకు బాగా మగ్గనివ్వండి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మంచి సువాసన రావడం మొదలవుతుంది.

-ఇప్పుడు కరివేపాకు, శుభ్రం చేసిన కొత్తిమీర, ఎండు మిరపకాయలు కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించి పొయ్యి ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు రుబ్బితే చట్నీ రుచి మారిపోతుంది.

-చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌ లో వేయండి. దానికి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. ఆ చిన్న పలుకులే తింటున్నప్పుడు భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఇప్పుడు అసలైన ఘట్టం. అదే బాండీలో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతుండగా మినపప్పు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. చివరగా ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి, ఆ కమ్మటి తాలింపు వాసన రాగానే దాన్ని చట్నీపై వేసి కలపండి.

-అంతే ఘుమఘుమలాడే, రుచిలో అమోఘమైన వేరుశెనగ చట్నీ సిద్ధం.

-ఈ చట్నీని వేడివేడి ఇడ్లీలతో, నెయ్యి దోశెలతో లేదా ఊతప్పంతో కలిపి తింటే ఆహా అనాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Monday, November 17, 2025, 11:45 [IST]
Desktop Bottom Promotion