పూరీ,చపాతీలకు అదిరిపోయే బంగాళాదుంప పచ్చి బఠాణీ కుర్మా..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మనలో చాలా మంది ఇళ్లలో ఉదయాన్నే వేడివేడి పూరీలు సిద్ధమైపోతాయి. పూరీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బంగాళాదుంప కూర. ఎప్పుడూ అదే బంగాళాదుంప కూర లేదా శనగపిండి కూర తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త విభిన్నంగా, రెస్టారెంట్ రుచిని తలపించేలా ఉండే బంగాళాదుంప, పచ్చి బఠాణీ కుర్మా ట్రై చేయండి. ఈ కుర్మా కేవలం పూరీలకే కాదు, చపాతీలు, పుల్కాలు, రోటీలతో కూడా అద్భుతంగా ఉంటుంది.

ఈ కుర్మా వండితే చాలు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికన్నా రెండు పూరీలు ఎక్కువే తింటారు. ముఖ్యంగా, పిల్లలు కూడా కారం లేకుండా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రుచికరమైన కుర్మాను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-సోంపు - 1/2 టీస్పూన్
-బిర్యానీ పువ్వు - 1
-దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
-పెద్ద ఉల్లిపాయ - 1
-పచ్చిమిర్చి - 4
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-టమోటా - 1
-ఉప్పు - రుచికి సరిపడా
-పసుపు - 1/4 టీస్పూన్
-పచ్చి బఠాణీలు - 200 గ్రాములు
-ఉడికించిన బంగాళాదుంపలు - పావు కిలో
-నీరు - సుమారు 1/2 లీటరు
-కొత్తిమీర - కొద్దిగా
-పచ్చి కొబ్బరి -అర కప్పు
-సోంపు - 1 టీస్పూన్
-గసగసాలు - 1 టీస్పూన్
-జీడిపప్పు - 6
-వేయించిన పల్లీలు - 1 టేబుల్ స్పూన్
-నీరు - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, సోంపు, గసగసాలు, జీడిపప్పు, పల్లీలు మిక్సీ జార్‌ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఒక లోతైన పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సోంపు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి అవి చిటపటలాడి, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.

-ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి వేయించాలి.

-ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు బాగా కలపాలి.

-ఆ తర్వాత తరిగిన టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. టమోటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యేవరకు మూత పెట్టి మగ్గించాలి.

-టమోటాలు బాగా మగ్గిన తర్వాత, పచ్చి బఠాణీలు వేసి ఒకసారి కలిపి, సుమారు అర లీటరు నీళ్లు పోయాలి. అంతా బాగా కలిపి మూత పెట్టి బఠాణీలు మెత్తగా ఉడికే వరకు 7-10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి.

-బఠాణీలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి నెమ్మదిగా కలపాలి.

-ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా ముద్దను వేసి, గ్రేవీకి అంతా బాగా పట్టేలా కలపాలి. మసాలా పచ్చి వాసన పోయి, కూర కాస్త చిక్కబడే వరకు మరో 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలి.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే బంగాళాదుంప బఠాణీ కుర్మా రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, August 29, 2025, 19:06 [IST]
Desktop Bottom Promotion