నోట్లో మెత్తగా కరిగిపోయేలా..మైసూర్ పాక్ ని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి..స్వీట్ షాపుని మించిన టేస్ట్

Posted By:

మైసూర్ పాక్.. పేరు వినగానే నోరూరిపోతుంది కొందరికి. కర్ణాటకలోని మైసూర్ నగరంతో దీనికి విడదీయరాని బంధం ఉంది. ఇది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇది ఒక సంప్రదాయం, వేడుకలకు, పండుగలకు, శుభకార్యాలకు ప్రతీక. ఈ స్వీట్ రాజకుటుంబం నుండి సాధారణ ప్రజలకు కూడా చేరువై మైసూర్ నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. మృదువైన ఆకృతి, నెయ్యి, చక్కెరల మధురమైన కలయిక మైసూర్ పాక్ ను భారతీయ మిఠాయిలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందేలా చేసింది.

మైసూర్ పాక్ ప్రధానంగా రెండు రకాలుగా తయారుచేయబడుతుంది. ఆ రెండు.. మెత్తని మైసూర్, గుల్ల మైసూర్ పాక్. మెత్తని మైసూర్ పాక్..నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. దీనికి ఎక్కువ నెయ్యి, తక్కువ వేడి అవసరం. గుల్ల మైసూర్ పాక్.. కొద్దిగా గట్టిగా, రవ్వ రవ్వగా ఉంటుంది. దీనికి ఎక్కువ వేడి,తక్కువ నెయ్యి అవసరం. అయితే మెత్తని మైసూర్ పాక్ ని మీ ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాపుకి మించిన స్టైల్ లో ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.

మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-శనగపిండి: 1 కప్పు ( 100-120 గ్రాములు)
-చక్కెర: 2 కప్పులు
-నెయ్యి: 2-3 కప్పులు
-నీరు: 1 కప్పు
-యాలకుల పొడి : 1/2 టీస్పూన్

బలం, ఆరోగ్యం, రుచి.. ఒకే సున్నుండలో..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

యైసూర్ పాక్ తయారీ విధానం

-ముందుగా మైసూర్ పాక్ పోయడానికి ఒక ట్రే లేదా వెడల్పాటి పాత్రను సిద్ధం చేసుకోండి. దీనికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఒక మందపాటి అడుగున్న బాండీని తీసుకుని అందులో శనగపిండిని సుమారు 2-3 నిమిషాలు, సన్నని మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించండి. వేయించిన తర్వాత శనగపిండిని పూర్తిగా చల్లార్చండి.

-శనగపిండి పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక జల్లెడతో జల్లించండి, ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోండి.

-ఇప్పుడు ఒక గిన్నెలో ఈ జల్లించిన శనగపిండిని తీసుకుని, కొద్దికొద్దిగా నెయ్యి కలుపుతూ ఉండలు లేకుండా నునుపుగా మిశ్రమం తయారు చేసుకోండి. ఈ మిశ్రమం చాలా మృదువుగా, క్రీము లాగా ఉండాలి.

-తర్వాత ఒక మందపాటి అడుగున్న పెద్ద పాత్రలో చక్కెర, నీరు కలిపి మీడియం మంటపై మరిగించండి. చక్కెర కరిగి, పాకం రావడం ప్రారంభమవుతుంది. పాకాన్ని వేళ్లతో పట్టుకుంటే ఒక సన్నని తీగలా సాగాలి. ఇది సుమారు 7-10 నిమిషాలు పట్టవచ్చు.

-పాకం సిద్ధమైన తర్వాత మంటను తగ్గించి నెయ్యి కలిపిన శనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పాకంలో కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమానికి మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం నెయ్యిని పీల్చుకుంటూ ఉంటుంది. నెయ్యి పూర్తిగా మిశ్రమంలో కలిసిపోయిన తర్వాత, మళ్ళీ కొద్దిగా నెయ్యి పోయండి. ఇలా మొత్తం నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ, మిశ్రమం పాత్రకు అంటుకోకుండా నెయ్యి పైకి తేలే వరకు కలుపుతూ ఉండండి. ఇది సుమారు 15-20 నిమిషాలు పట్టవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ పోస్తే మైసూర్ పాక్ అంత మెత్తగా వస్తుంది. ఈ దశలో యాలకుల పొడి వేసి కలపవచ్చు.

-మిశ్రమం గోధుమ రంగులోకి మారి, పాత్రకు అంటుకోకుండా నెయ్యి పూర్తిగా పైకి తేలిన తర్వాత మంట ఆపి సిద్ధం చేసుకున్న నెయ్యి రాసిన ట్రేలోకి వేయండి.

-ట్రేలో పోసిన తర్వాత, ఒక గంట వరకు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారడానికి 2-3 గంటలు పట్టవచ్చు. అంతే మైసూర్ పాక్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, May 25, 2025, 6:21 [IST]
Desktop Bottom Promotion