ఇడ్లీ, దోశల్లోకి రొటీన్ చట్నీలతో బోర్ కొట్టిందా? ఆరెంజ్ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి

Posted By:

రోజూ తినే ఇడ్లీ, దోశ లేదా చపాతీలలోకి ఎప్పుడూ కొబ్బరి చట్నీ లేదా టమాటో పచ్చడి తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొత్తగా ఆరెంజ్ చట్నీ ప్రయత్నించండి. నారింజ పండుతో తయారు చేసే చట్నీ అనేది తీపి, పులుపు, కారం కలగలిసిన ఒక అద్భుతమైన వంటకం.

ఇది బ్రెడ్ జామ్‌ లా పిల్లలకు నచ్చడమే కాదు, టిఫిన్స్‌ లో నంచుకోవడానికి పెద్దలకూ ఎంతగానో నచ్చుతుంది. ఆరెంజ్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sweet Sour and Spicy The Ultimate Orange Chutney Recipe You Must Try

కావలసిన పదార్థాలు
రసం ఎక్కువ ఉండే నారింజ పండ్లు: 4
నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు: 2
ఇంగువ: చిటికెడు
పసుపు: అర టీస్పూన్
ఎర్ర కారం: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: అర కప్పు
వెనిగర్: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా నారింజ పండ్లను శుభ్రంగా కడగాలి. వాటి తొక్కను పూర్తిగా తీసివేసి, లోపల ఉండే గింజలను తొలగించాలి. గింజలు ఉంటే చట్నీ చేదుగా మారే ప్రమాదం ఉంది. అలాగే పండ్ల తొనలపై ఉండే తెల్లటి పొరను కూడా సాధ్యమైనంత వరకు తీసేసి గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే జీలకర్ర వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి పాన్ లో పసుపు, కారం, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నారింజ ముక్కలను పాన్‌లో వేసి, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

-మధ్యమధ్యలో గరిటతో కలుపుతూ, ముక్కలను మెత్తగా మాష్ చేస్తూ ఉండాలి. నారింజలోని నీరంతా ఇగిరిపోయి, గుజ్జు దగ్గరపడే వరకు ఉడికించాలి.

-నారింజ గుజ్జు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

-పంచదార కరిగి పాకంలా తయారవుతుంది. ఈ దశలో చట్నీ మరీ తియ్యగా అనిపిస్తే లేదా పులుపు ఎక్కువగా ఉంటే, రుచిని బ్యాలెన్స్ చేయడానికి రెండు ఎండు మిరపకాయలను తుంచి వేయండి. మరో 10 నిమిషాల పాటు లేదా మిశ్రమం జామ్‌ లా చిక్కగా అయ్యే వరకు సన్నని మంటపై మరిగించాలి.

-చట్నీ బాగా దగ్గర పడి నూనె పైకి తేలే సమయంలో వెనిగర్ వేసి బాగా కలిపి, ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆపేయండి. వెనిగర్ వేయడం వల్ల చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా, మంచి రుచిని ఇస్తుంది.

-తయారైన ఆరెంజ్ చట్నీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీనిని గాజు సీసాలో భద్రపరుచుకోండి. వేడివేడి చపాతీలు, బ్రెడ్ టోస్ట్, పూరీ లేదా దోశల్లోకి ఈ చట్నీని తింటే బాగుంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, December 5, 2025, 20:50 [IST]
Desktop Bottom Promotion