ఘుమఘుమలాడే సోయాబీన్ ఆలూ పులావ్..ప్రెషర్ కుక్కర్‌ లో 2 విజిల్స్‌ కే రెడీ

Posted By:

భారతీయ వంటకాల్లో పులావ్‌ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన వంటకం ఇది. కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందించే పులావ్ కోసం చూస్తున్నట్లయితే సోయాబీన్ ఆలూ పులావ్ ఒక అద్భుతమైన ఎంపిక.

ప్రోటీన్ సమృద్ధిగా ఉండే సోయా, కార్బోహైడ్రేట్లు అందించే బంగాళదుంప, సుగంధభరితమైన బాస్మతి బియ్యం, మసాలా దినుసుల మేళవింపుతో ఇది ఒక సంపూర్ణ భోజనంగా నిలుస్తుంది. ప్రెషర్ కుక్కర్ లో సోయాబీన్ ఆలూ పులావ్‌ ను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Taste Meets Health The Ultimate Protein Rich Soya Pulao Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పులు
సోయా చంక్స్ (మీల్ మేకర్)- 1 కప్పు
బంగాళదుంపలు- 2
ఉల్లిపాయలు- 2
టమోటాలు- 2
పచ్చిమిర్చి- 3-4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నూనె లేదా నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- అర టీస్పూన్
కారం- 1 టీస్పూన్
గరం మసాలా- 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 2
దాల్చిన చెక్క- 1 అంగుళం ముక్క
లవంగాలు- 4
యాలకులు - 2
షాజీరా- అర టీస్పూన్
పుదీనా ఆకులు- గుప్పెడు
కొత్తిమీర తరుగు- గుప్పెడు
నిమ్మరసం- 1 టీస్పూన్
నీళ్లు - రెండున్నర కప్పులు

తయారీ విధానం
-బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

-ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో సోయా చంక్స్ వేసి 10-15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని చేతులతో గట్టిగా పిండి అదనపు నీటిని తీసివేయాలి.

-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ ను స్టవ్ మీద పెట్టి నూనె లేదా నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి ఒక నిమిషం పాటు సువాసన వచ్చే వరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు మీడియం మంటపై వేయించాలి.

-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాక తరిగిన టమోటాలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.

-తర్వాత పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీళ్లు పిండిన సోయా చంక్స్ వేసి మసాలాలన్నీ వాటికి పట్టేలా 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి.

-తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యంలోని నీటిని పూర్తిగా వడకట్టి ఆ బియ్యాన్ని కుక్కర్‌ లో వేయాలి. సున్నితంగా ఒక నిమిషం పాటు కలిపి ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి ఒకసారి నెమ్మదిగా కలపాలి.

-ప్రెషర్ కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే వేడివేడి, ఘుమఘుమలాడే సోయాబీన్ ఆలూ పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, November 13, 2025, 11:17 [IST]
Desktop Bottom Promotion