కమ్మని నెయ్యి వాసనతో..వెన్నలా కరిగిపోయే పూర్ణం బూరెలు

Posted By:

పూర్ణం బూరెలు పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. వేడివేడి బూరెను చేతిలోకి తీసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం.

ఇందులో వాడే పదార్థాలు, తయారుచేసే విధానం అన్నీ ఆరోగ్యాన్ని, సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకున్నవే. ఇది శక్తికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు.

The Perfect Poornam Boorelu A Foolproof Recipe for a Classic Treat

కావలసిన పదార్థాలు

పచ్చి శనగపప్పు- 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 2 కప్పులు
రేషన్ బియ్యం (దోశ బియ్యం) - 1 కప్పు
మినపప్పు - అర కప్పు
ఉప్పు - చిటికెడు
పంచదార - 1 టీస్పూన్
నూనె లేదా నెయ్యి - సరిపడినంత

The Perfect Poornam Boorelu A Foolproof Recipe for a Classic Treat

తయారీ విధానం

-ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, ఒక గంటపాటు నానబెట్టాలి.

-బియ్యం, మినపప్పును వేర్వేరుగా కడిగి, కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి.

-తర్వాత కుక్కర్‌ లో నానిన పచ్చిశెనగపప్పు, 2 కప్పుల నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి. చేత్తో నొక్కితే మెత్తగా అయ్యేలా ఉండాలి. కుక్కర్‌ లో నీళ్లు ఎక్కువగా ఉంటే, వాటిని వంపేసి పప్పును మాత్రం తీసుకోవాలి.

-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంట మీద కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక, దానిని వడకట్టుకోవాలి.

-ఇప్పుడు వడకట్టిన బెల్లం పాకాన్ని మళ్లీ పొయ్యి మీద పెట్టి అందులో ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ముద్దను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో మెదుపుతూ ఉండాలి. మిశ్రమం గిన్నె అంచుల నుండి విడివడి, ముద్దలా తయారవుతున్నప్పుడు అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.

-ఈ పూర్ణం మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి.

-ఇప్పుడు నానిన బియ్యం,మినపప్పులోని నీళ్లు వంపేసి, గ్రైండర్‌ లో ముందుగా మినపప్పును వేసి కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా, వెన్నలా రుబ్బుకోవాలి. తర్వాత బియ్యాన్ని కూడా వేసి దోశ పిండి కంటే కొంచెం గట్టిగా, జారేలా రుబ్బుకోవాలి.

-రుబ్బిన రెండు పిండిలను ఒక గిన్నెలో వేసి, చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. పూర్ణం ఉండకు పిండి బాగా పట్టేలా ఉండాలి. ఈ పిండిని కనీసం 2-3 గంటలు నాననిస్తే బూరెలు మృదువుగా వస్తాయి.

-ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. నూనె మరీ ఎక్కువగా కాగకూడదు.

-ముందుగా సిద్ధం చేసుకున్న పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుని రెడీ చేసుకున్న పిండిలో పూర్తిగా మునిగేలా ముంచి వేడెక్కిన నూనెలో వదలాలి.

-ఒక నిమిషం తర్వాత, గరిటెతో మెల్లగా తిప్పుతూ అన్ని వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

-వేగిన బూరెలను నూనె నుండి తీసి టిష్యూ పేపర్‌ పై వేస్తే అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే పూర్ణం బూరెలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, November 16, 2025, 15:56 [IST]
Desktop Bottom Promotion