ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్‌ కి హెల్త్.. టేస్ట్ ‌కి టేస్ట్!

Posted By:

తెలుగువారి లోగిళ్లలో ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు.. ఇలా జీవితంలోని కష్టసుఖాలకు, భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచే ఈ షడ్రుచుల సమ్మేళనం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, మన సంప్రదాయంలో భాగం. ఈ పచ్చడి ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.

అయితే ఈసారి ఉగాది పండుగకు కాస్త వైవిధ్యంగా, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు స్టైల్‌ లో వెప్పం పూ రసం ట్రై చేయండి. తమిళనాడులో ఉగాదిని పుదు వరుష పిరప్పు(తమిళ నూతన సంవత్సరం) పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున తమిళులు మన ఉగాది పచ్చడి తరహాలోనే సాంప్రదాయబద్ధంగా వెప్పం పూ రసం (వేప పూల రసం) తయారు చేస్తారు. చేదు, పులుపు, తీపి కలగలిపిన ఈ రసం అమృతంలా ఉంటుంది.

Ugadi 2026 Special Tamil Nadu Famous Healthy and Tasty Veppam Poo Rasam Recipe in Telugu

వెప్పం పూ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు

చింతపండు రసం - ఒక కప్పు
కందిపప్పు - ఒక కప్పు
తాజా వేప పువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - రెండు స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
పసుపు - అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు (మంచి సువాసన కోసం)
నూనె - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - 3
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 5 లేదా 6 రెమ్మలు
ఉప్పు - రుచికి తగినంత

వెప్పం పూ రసం తయారీ విధానం

-తాజా వేప పువ్వులను శుభ్రం చేసి పెట్టుకోవాలి

-ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, శుభ్రం చేసుకున్న వేప పువ్వులను వేసి, సన్నని మంట మీద అవి కాస్త రంగు మారే వరకు దోరగా వేయించుకుని ఒక ప్లేట్‌ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో మరో స్పూన్ నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఇందులోనే కందిపప్పు కూడా వేసి పచ్చివాసన పోయేలా కొద్దిసేపు వేయించుకోవాలి.

-పోపు మంచిగా వేగాక, అందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఆ వెంటనే అర టీస్పూన్ పసుపు, రెండు స్పూన్ల బెల్లం తురుము వేసి గరిటతో బాగా కలపాలి.

-ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉంచి, చింతపండు పచ్చివాసన పోయి, రసం బాగా మరిగే వరకు కుక్ చేయాలి. రసం ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును జతచేయాలి.

-రసం చక్కగా మరిగి, కమ్మటి వాసన వస్తున్న సమయంలో.. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న వేప పువ్వులను అందులో వేసి కలపాలి. ఇప్పుడు మంట తగ్గించి కేవలం రెండే రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుంటే చాలు వెప్పం పూ రసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, March 14, 2026, 10:31 [IST]
Desktop Bottom Promotion