లేడీస్ బాత్రూమ్‌ లో కెమెరాలు,రాత్రి బేబీ స్వీట్ గర్ల్ మెసేజ్‌ లు..స్వామి చైతన్యానంద సరస్వతి బండారం బట్టబయలు

దేశ రాజధాని ఢిల్లీలో విద్య పేరుతో జరుగుతున్న ఓ ఘోరమైన అకృత్యం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక గురువు ముసుగులో శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు 62 ఏళ్ల స్వామి చైతన్యానంద సరస్వతి అనేక మంది విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. హాస్టల్ బాత్రూమ్‌ ల దగ్గర రహస్య కెమెరాలు, అర్ధరాత్రి అసభ్యకరమైన వాట్సాప్ మేసేజ్ లు, లైంగిక వాంఛ తీర్చమంటూ వేధింపులు.. ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఓ బాధితురాలి ఆవేదన..
2016లోనే స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన పార్థసారథి అనే యువతి.. తాను అనుభవించిన నరకాన్ని కన్నీళ్లతో వివరించింది. ఆ యువతి మాట్లాడుతూ.."అది నా జీవితంలో అత్యంత భయంకరమైన సమయం. ఇన్‌ స్టిట్యూట్ ‌లో చేరిన కొద్ది రోజులకే స్వామి నాకు బేబీ, స్వీట్ గర్ల్ అంటూ అసభ్యకరమైన సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. సాయంత్రం క్లాసులు ముగియగానే తన ఆఫీసుకు పిలిపించుకుని నువ్వు చాలా ప్రతిభావంతురాలివి, నీ చదువు ఖర్చంతా నేనే భరించి దుబాయ్ ‌కి పంపిస్తా అంటూ ఆశ పెట్టేవాడు. ఆ ప్రలోభాలకు లొంగకపోవడంతో అతని అసలు స్వరూపం బయటపడింది. నా ఫోన్ లాక్కుని, హాస్టల్‌ లో నన్ను ఒంటరిని చేశారు. ఎవరితోనూ మాట్లాడనిచ్చేవారు కాదు. రాత్రిపూట నా గదికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవారు. ఒకరోజు నన్ను హోటల్‌ కు తీసుకెళ్లి, తనతో పాటు ఉండాలని బలవంతం చేయడంతో భయంతో వణికిపోయాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, నా వస్తువులన్నీ వదిలేసి ఆ నరకం నుంచి పారిపోయాను" అంటూ ఆమె తన భయానక అనుభవాన్ని పంచుకుంది.

CCTV in Hostels Obscene Messages Shocking Allegations on Swami Chaitanyananda Saraswati

పోలీసుల వేట
చైతన్యానంద సరస్వతి వల్ల తాము కూడా ఇబ్బంది పడ్డామంటూ 17 మంది విద్యార్థినులు ఇటీవల ఆగస్టులో సమిష్టిగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చింది. హాస్టల్‌ లోని ప్రతి మూలలో, చివరకు బాత్రూమ్‌ ల పరిసరాల్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి, విద్యార్థినుల వ్యక్తిగత కదలికలను గమనించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మీకు ఎవరితోనైనా లైంగిక సంబంధాలు ఉన్నాయా? కండోమ్ వాడారా? వంటి నీచమైన ప్రశ్నలతో తమను మానసికంగా హింసించేవాడని.. ఎవరైనా ఎదురు తిరిగితే వారి హాజరు తగ్గించడం, గ్రేడ్‌ లు తగ్గించడం, చివరికి డిగ్రీలు కూడా ఆపివేసి వారి భవిష్యత్తును నాశనం చేసేవాడని వారు వాపోయారు.

ఈ పాపంలో అసోసియేట్ డీన్‌ తో సహా ముగ్గురు మహిళా సిబ్బంది కూడా భాగస్వాములని ఎఫ్‌ ఐఆర్‌ లో తెలిపారు. వీరు బాధితులపై ఒత్తిడి తేవడం, సాక్ష్యాలను నాశనం చేయడంలో స్వామికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కూడా

గతంలో 2009, 2016లలో కూడా స్వామి చైతన్యానంద సరస్వతిపై కేసులు నమోదైనప్పటికీ తన పలుకుబడితో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతి కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఆగస్టు నుంచి అజ్ఞాతంలో ఉన్న ఈ నకిలీ స్వామి కోసం వేట కొనసాగుతోంది.

Story first published: Friday, September 26, 2025, 13:00 [IST]
Desktop Bottom Promotion