ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ సలహా..నెట్టింట పెను దుమారం..కౌంటర్ ఇచ్చిన కార్పొరేట్ దిగ్గజం!

ఐఐటీ హైదరాబాద్ వేదికగా రెండు రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త,టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపాయి. మహిళా సాధికారత, ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉపాసన ఇచ్చిన ఒక సలహా ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఉపాసన ఏమన్నారు?

విద్యార్థులతో ఉపాసన మాట్లాడుతూ.."మహిళలకు అతిపెద్ద ఇన్స్యూరెన్స్..వారి అండాలను(ఎగ్స్) భద్రపరచుకోవడమే..మీరు ఆర్థికంగా స్థిరపడే వరకు, మీ సొంత నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలను కనాలన్నా ఎగ్ ఫ్రీజింగ్ మీకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను నా కాళ్లపై నిలబడ్డాకే జీవితంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలిగాను. 30 ఏళ్లలోపు మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి, సంపదను సృష్టించుకోండి" అని అన్నారు.

Upasana s Egg Freezing Advice at IIT Hyderabad Sparks Major Social Media Outrage

విమర్శల వెల్లువ..ఇది సామాన్యులకు సాధ్యమేనా?
ఉపాసన ఉద్దేశం మంచిదే అయినా, ఈ సలహా ఉన్నత వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

మ్యాట్రిమోనియల్ సైట్ జోడి 365 సీఈఓ అనిల్ కుమార్ ఎక్స్ లో స్పందిస్తూ.. ఇలాంటి సలహాలతో ప్రభావితమై పెళ్లిని వాయిదా వేసుకున్న 30 ఏళ్ల పైబడిన మహిళలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.

ఉపాసన వ్యాఖ్యలపై ప్రముఖ గైనకాలజిస్ట్ రాజేష్ పారిఖ్ ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. బ్యాంకులో కోట్లు ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ సలహా ఇవ్వడం సులభమే. కానీ ఇది బాధాకరమైన ఇంజెక్షన్లు, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమతో కూడిన ప్రక్రియ అని గుర్తుచేశారు.

కొందరు నెటిజన్లు దీనిని మేజర్ పీఆర్ ఫెయిల్యూర్ గా అభివర్ణించగా, మరికొందరు దీనిని ఐవీఎఫ్ (IVF) సెంటర్ల మార్కెటింగ్ గా కొట్టిపారేశారు.

అసలు వాస్తవాలు - ఖర్చులు
ఎమోషన్స్ పక్కన పెడితే, సైన్స్, ఆర్థిక గణాంకాలు ఇలా ఉన్నాయి.

30 ఏళ్లలోపు స్త్రీలలో సహజ గర్భధారణ అవకాశాలు ఎక్కువ. 35 ఏళ్ల తర్వాత అండాల నాణ్యత తగ్గుతుంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నా, 35 ఏళ్లలోపు భద్రపరిచిన అండాలతోనే సక్సెస్ రేటు (70-80శాతం) అధికంగా ఉంటుంది.

భారతదేశంలో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలంటే ఒక్కో సైకిల్‌కు రూ.1.2 లక్షల నుండి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కేవలం ఫ్రీజింగ్ మాత్రమే కాదు, వాటిని భద్రపరచడానికి క్లినిక్‌ ను బట్టి ఏటా రూ.5 వేల నుండి రూ.30 వేల వరకు స్టోరేజ్ ఫీజు చెల్లించాలి. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుంది. పైగా దీనికి సాధారణంగా బీమా వర్తించదు.

ఉపాసన మాటల్లో కెరీర్ ఫోకస్ ఉన్నప్పటికీ, అది ఆచరణలో సామాన్య మధ్యతరగతి మహిళలకు ఎంతవరకు సాధ్యం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం, కానీ బయోలాజికల్ క్లాక్ కూడా అంతే ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

Upasana s Egg Freezing Advice at IIT Hyderabad Sparks Major Social Media Outrage

20 ఏళ్లకే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలన్నా జోహో ఫౌండర్
ఇక ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో జరిగిన సంభాషణ వీడియో క్లిప్ ను తన ఎక్స్ లో ఉపాసన షేర్ చేసింది. అందులో.. ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ఉపాసన అడగ్గా అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువమంది చేతులు ఎత్తారు. దీనిని బట్టి మహిళలు కెరీర్ పై ఎక్కువ దృష్టి సారించినట్లు కనబడుతోంది..ఇది కొత్త ప్రోగ్రెసివ్ ఇండియా అని ఉపాసన ఎక్స్ పోస్ట్ లో తెలిపారు.

అయితే ఉపాసన పోస్ట్ పై స్పందించిన జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు..యువత 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని పిల్లలని కనాలని యువతకు సలహా ఇచ్చారు. సమాజం, పూర్వీకుల కోసం ఈ డ్యూటీని వాళ్లు నిర్వర్తించాలని సూచించారు. అయితే ఇవన్నీ పాతకాలం మాటల్లా అనిపిస్తుంటాయి.. కాకపోతే కాలక్రమంలో జరగాల్సిందే ఇదేనని తాను భావిస్తానని ఎక్స్ లో ఉపాసన పోస్ట్ కి రిప్లై ఇచ్చారు. శ్రీధర్ వెంబు పెళ్లి సలహాలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం గర్భవతిగా

ఇక ఉపాసన, రామ్ చరణ్ కి 2012 లో అంటే ఉపాసనకు 23 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పెళ్లి అయ్యింది. వీరికి 2023లో ఒక కూతరు పుట్టింది. ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్నారు. ఇటీవలే ఉపాసనకి సీమంతం కూడా జరిగింది.

Desktop Bottom Promotion