వరలక్ష్మీ వ్రతం: తెలుసుకోవాల్సిన చరిత్ర, ప్రాముఖ్యత, పూజా విధానం

వరలక్ష్మీ వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు (ధనం, ధాన్యం, ధైర్యం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి) పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది శుక్రవారం ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం చరిత్ర, ప్రాముఖ్యత
స్కంద పురాణం ప్రకారం, వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. ఈ వ్రతం స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఆచరిస్తారు. ఈ వ్రతం వెనుక ఒక కథ కూడా ఉంది.

A Guide to Varalakshmi Vratam 2025 History Significance and Rituals

పూర్వ కాలంలో మగధ దేశంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఉత్తమ గుణాలు కలిగిన మహిళ ఉండేది. ఆమె భర్త, అత్తమామల పట్ల గౌరవంతో, అత్యంత భక్తితో లక్ష్మీదేవిని పూజించేది. ఒకరోజు లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. చారుమతి తన కలను తన కుటుంబ సభ్యులకు చెప్పి, లక్ష్మీదేవి చెప్పిన విధంగా వ్రతం ఆచరించింది. ఈ వ్రతం కారణంగా చారుమతితో పాటు ఆమెతో పాటు పూజలో పాల్గొన్న ఇతర మహిళలకు కూడా సిరిసంపదలు, సుఖసంతోషాలు లభించాయి. అప్పటినుండి ఈ వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి?
వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ఎలాంటి కఠినమైన నియమాలు అవసరం లేదు. కేవలం శుభ్రమైన మనసు, భక్తిశ్రద్ధలు ఉంటే చాలు.

శుభ్రత: వ్రతం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పూజ గదిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి.

మండపం, కలశం: పూజ గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, దానిపై బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం పెట్టాలి. కలశం మీద కొబ్బరి కాయను, అమ్మవారి ముఖాన్ని అలంకరించాలి.

పూజ: అమ్మవారికి షోడశోపచార పూజ (16 రకాల పూజలు) చేయాలి. పూలతో, పసుపు-కుంకుమతో పూజించి, వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి.

తోర పూజ: ఐదు లేదా తొమ్మిది పోగుల దారానికి పసుపు రాసి, దానికి పూలు కట్టి ముడులు వేయాలి. ఈ తోరాన్ని పూజ చేసి, వ్రతం పూర్తయిన తర్వాత చేతికి కట్టుకోవాలి.

నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అందులో అరిసెలు, పులిహోర, పాయసం, వడపప్పు, పానకం వంటివి ముఖ్యమైనవి.

వాయనం: వ్రతం పూర్తయిన తర్వాత, ముత్తైదువులకు తాంబూలం, పసుపు-కుంకుమ, ప్రసాదంతో పాటు కానుకలు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి.

ఈ వ్రత కథను చదవడం లేదా వినడం ద్వారా కూడా వ్రతం పూర్తి ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ పండుగ మనకు సంతోషం, సంపద,ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Desktop Bottom Promotion