తిరుమలలో అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Brahmotsavam: Ashwa Vahana Seva - కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహ‌న‌సేవ రంగరంగ వైభవంగా జ‌రిగింది.

అశ్వ వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

Brahmotsavam: Vahana sevas culminates with Ashwa Vahana in Tirumala

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి.

అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్క‌రిణిలో స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వ వాహ‌నసేవ‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆక‌ట్టుకున్నాయి. మొత్తం 11 క‌ళాబృందాలలో 288 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో విద్యార్థులు దశావతార నృత్య రూపకంతో అలరించారు. అనంతపురానికి చెందిన బుచ్చిబాబు ఉరుముల భజనతో ఆకట్టుకున్నారు. తిరువనంతపురానికి చెందిన శ్రీమతి బృందం ఆధ్వర్యంలో భరత నాట్యం అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. తిరుపతికి చెందిన చందన బృందం రాజస్థాని నృత్యంతో కనువిందు చేశారు.

Desktop Bottom Promotion