శివుడి పంచారామ క్షేత్రాల్లో ఒకటి..సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం స్పెషాలిటీ ఇదే,భారీగా భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వీధులన్నీ మార్మోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక శివపూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా పంచారామాల్లో ఒకటైన కాకినాడ జిల్లాలోని సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

భక్తులు భీమేశ్వర స్వామి, పార్వతీ దేవిని పూజించే ముందు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ పవిత్రమైన రోజున భగవంతుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక్కడ భీమ గుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామి వారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామి వారికి బాలా త్రిపురసుందరికీ వైభవంగా వివాహం మహోత్సవం జరిపిస్తారు.

Devotees Flock to Sri Chalukya Kumararama Bhimeswara Swamy Temple on Mahashivaratri 2025

దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. క్రీ.శ. 892 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి. చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఇక్కడ స్వామి వారు లింగరూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు బాల త్రిపురసుందరిగా పూజలందుకుంటుంది.

ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్ఛటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఉగుతుంది. సామర్లకోటలోని భీమేవ్వరాలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. భీమేశ్వరస్వామి గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్ప కళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలూ ఒకేలా ఉండకపోవడం గమనార్హం.

దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళీ, శనేవ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలాత్రిపురసుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది.

Story first published: Wednesday, February 26, 2025, 12:34 [IST]
Desktop Bottom Promotion