Diwali 2025: దీపావళి ప్రాముఖ్యత, పూజా విధానం, శుభ ముహూర్తం, పఠించాల్సిన మంత్రాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగను ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష (చీకటి పక్షం) అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా లక్ష్మీదేవి, గణేశుడు, సరస్వతి దేవత, కాళీ దేవిని పూజిస్తారు. భారతీయలులే కాకుండా ఇటీవల సంవత్సరాల్లో విదేశీయులు కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ లో కూడా దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. దీపావళి 5 రోజుల పండుగ.. ధంతేరస్, నరక్ చతుర్దశి (ఛోటీ దీపావళి), లక్ష్మీ పూజ(ప్రధాన దీపావళి), గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ పేర్లతో ఐదు రోజుల పాటు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ వెలుగుల పండుగ, కుటుంబ సంబంధాలను, సాంప్రదాయ విలువలను గుర్తుచేస్తుంది. ప్రతి ఇల్లు దీపాల జిగేల్మనే కాంతులతో, టపాకాయల సందడితో కళకళలాడుతుంది. 2025లో అంటే ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి ప్రాముఖ్యత, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, శుభ ముహూర్తం వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

Diwali 2025 lakshmi puja vidhi signifiance shubh muhurat and mantras

దీపావళి ప్రాముఖ్యత
దీపావళిని జరుపుకోవడానికి అనేక పౌరాణిక కారణాలు ఉన్నాయి. పద్నాలుగేళ్ల వనవాసం, రావణ సంహారం అనంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజునే ప్రజలు దీపాలు వెలిగించి ఘనంగా స్వాగతం పలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడనే రాక్షసుడిని సంహరించి అతని చెరలో ఉన్న పదహారు వేల మంది కన్యలకు విముక్తి కలిగించిన రోజు ఇది. అందుకే చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి జరుపుకుంటారు.

లక్ష్మీ పూజ
దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి శుభ్రంగా, దీపాలతో అలంకరించబడిన ఇళ్లలోకి ప్రవేశించి సిరిసంపదలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Diwali 2025 lakshmi puja vidhi signifiance shubh muhurat and mantras

లక్ష్మీ పూజా విధానం

దీపావళి రోజున ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఒక పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి, మధ్యలో కలశాన్ని ఏర్పాటు చేయాలి. పక్కన లక్ష్మీదేవి, వినాయకుడి ప్రతిమలను లేదా చిత్రపటాలను ఉంచాలి. ముందుగా విఘ్నాలు తొలగాలని గణపతిని ప్రార్థించాలి. అనంతరం లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుని, ఆవాహన చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో అమ్మవారిని పూజించి తామర పువ్వులు, మల్లెలు, గులాబీలు వంటి తాజా పువ్వులను సమర్పించాలి. పాయసం, లడ్డూలు, పండ్లు, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ఇంటిని ప్రమిదలతో అలంకరించాలి. ఈ దీపాలు చీకటిని, ప్రతికూల శక్తులను పారద్రోలి, సానుకూలతను నింపుతాయి.

పఠించాల్సిన ముఖ్య మంత్రాలు
పూజ సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల విశేష ఫలాలు కలుగుతాయి.

గణేశ మంత్రం: ఓం గం గణపతయే నమః.

లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః.

దీపారాధన మంత్రం: శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః..శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే .

లక్ష్మీ పూజకు పవిత్రమైన సమయం
లక్ష్మీ పూజకు పవిత్రమైన సమయం అక్టోబర్ 20 సాయంత్రం 7:08 గంటలకు ప్రారంభమై రాత్రి 8:18 వరకు కొనసాగుతుంది.

Desktop Bottom Promotion