నవరాత్రి సమయంలో..ఏ దేవాలయాలను సందర్శించడం మంచిదో తెలుసా?

శరదృతువు ఆగమనంతో భారతదేశమంతటా పండుగల సందడి మొదలవుతుంది. అందులో అత్యంత ముఖ్యమైనది దేవీ నవరాత్రి ఉత్సవం. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాలను ఆరాధిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా జరిగినా, దక్షిణ భారతదేశంలోని కొన్ని ఆలయాలలో ఈ వేడుకల వైభవం మాటల్లో వర్ణించలేనిది. ఈ నవరాత్రులకు ఈ ఆలయాలను సందర్శించి, అమ్మవారి దివ్యమైన అనుగ్రహాన్ని పొందడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలబోసిన ఆ అద్భుతమైన ఆలయాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి.

Experience the Divine Famous Navaratri Temples in South India

చాముండేశ్వరి ఆలయం, మైసూరు
నవరాత్రి ఉత్సవాలంటే మొదటగా గుర్తుకువచ్చేది మైసూరు దసరా. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లోని చాముండి పర్వతాలపై కొలువైన చాముండేశ్వరి దేవి, రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ప్రదేశం ఇదే. ఆ విజయానికి గుర్తుగా ఇక్కడ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయదశమి నాడు జరిగే జంబూ సవారీ (ఏనుగుల ఊరేగింపు) ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన మైసూరు రాజభవనం, నగరం అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు.

మీనాక్షి అమ్మవారి ఆలయం, మదురై
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ బొమ్మల కొలువు. ఆలయ ప్రాంగణంలో పురాణ గాథలు, సామాజిక ఇతివృత్తాలను ప్రతిబింబించేలా వేలాది బొమ్మలను అందంగా అలంకరిస్తారు. ప్రతిరోజూ మీనాక్షి అమ్మవారిని ఒక ప్రత్యేక అలంకారంలో అలంకరించి పూజిస్తారు. సంగీత, నాట్య కచేరీలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఒక మధురానుభూతి.

కనకదుర్గ ఆలయం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పది రోజుల పాటు అమ్మవారిని బాలాత్రిపురసుందరి, గాయత్రి, సరస్వతి, లలిత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి వంటి పది రూపాలలో అలంకరిస్తారు. లక్షలాది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. విజయదశమి రోజున కృష్ణా నదిలో జరిగే తెప్పోత్సవం కన్నుల పండువగా ఉంటుంది.

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన భ్రమరాంబ దేవికి నవరాత్రులలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ప్రతిరోజూ చండీయాగం, రుద్రహోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అడవుల మధ్య, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయంలో నవరాత్రి అనుభవం ప్రశాంతంగా, భక్తిమయంగా ఉంటుంది. అమ్మవారి శక్తిని ప్రత్యక్షంగా అనుభూతి చెందాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం.

Story first published: Wednesday, September 24, 2025, 8:34 [IST]
Desktop Bottom Promotion