గంటలోనే కోరికలు తీర్చే అమ్మవారి ఆలయం.. ప్రపంచంలోనే రెండు మాత్రమే ఉన్నాయి.. ఈ ఆలయం ఎక్కడుందంటే?

స్వయంభూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ దేవాలయాల్లోని దేవతలు స్వయంగా మన సమస్యలను పరిష్కరించడంతో పాటు కోరికలు కూడా నెరవేరుస్తారని ప్రతీతి ఉంది. అందుకే ప్రపంచంలోని స్వయంభూ దేవాలయాలకు భక్తుల రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. కరీంనగర్‌ జిల్లా గున్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కూడా ఒక స్వయంభు ఆలయం ఉంది.

అదే మానసాదేవి ఆలయం. ఈ ఆలయానికి గల ప్రాముఖ్యత ఏమిటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి?, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.

History and significance of Most powerful Manasa devi temple in karimnagar Here direction to reach it

ఆలయ చరిత్ర..

ప్రపంచంలో కేవలం రెండు మానసాదేవి స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అలాంటి స్వయంభు ఆలయాల్లో కాశింపేటలోని మానసాదేవి ఆలయం కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం కాశింపేట గ్రామంలో పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. భూమిని తవ్వుతున్నప్పుడు మానసాదేవి అమ్మవారి విగ్రహం, శ్రీమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చాయట. ఈ విగ్రహాలు సుమారు 800 ఏళ్ళ నాటివిగా గుర్తించారు. ఈ ఆలయంలో శ్రీమానస దేవి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో, వెండి నాగుల కవచం కింద సేదదీరుతూ దర్శనమిస్తారు.

ఎలాంటి కోరికలు తీరుతాయంటే..

ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారికి నమస్కారాలు సమర్పించి ముడుపులు కడితే ఎలాంటి సమస్య అయినా తీరుతుందట. అలాగే మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా అది తక్షణమే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మరీ ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేని వారు అమ్మవారిని మొక్కుకొని ముడుపులు కడితే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మనసుపెట్టి మొక్కితే గంటల్లోనే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని చెబుతూ ఉంటారు.

ఎలాంటి పూజలు చేస్తారంటే..

ఈ మనసాదేవి అమ్మవారికి ప్రతీ మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, చండీహోమం కూడా చేస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు సామూహికంగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈ ఆలయంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ప్రతీ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయని భక్తులు చెబుతుంటారు.

108 శివలింగాలు..

ఈ ఆలయంలో ముఖ్యంగా ఒక చోటు ఉంటుంది. అక్కడ 108 నాగ ప్రతిమ శివలింగాలను ప్రతిష్టించారు. కోనేరు చుట్టూ ఆ శివ లింగాల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలను ధర్మ గుండం నుంచి నీటిని తీసి అభిషేకం చేస్తే.. 108 శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుంది. అలాగే శివయ్య అనుగ్రహం మీపై కలుగుతుందని నమ్ముతుంటారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఆలయంలో ప్రతీరోజు అన్నదానం చేస్తూ ఉంటారు.

ఈ ఆలయాన్ని చేరుకోవడం ఎలా..

ఈ ఆలయం కరీంనగర్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్ధిపేట నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కరీంనగర్ నుంచి లేదా సిద్ధిపేట నుంచి లేదా హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ నుంచి ప్రతిరోజూ రెండు ఉదయం 7 గంటలకు, 10 గంటలకు రెండు బస్సులు ఈ ఆలయానికి ఉంటాయి.

Story first published: Friday, October 25, 2024, 10:15 [IST]
Desktop Bottom Promotion