మీరు ఈసారి ముంబైకి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని చూడాల్సిందే.!

ఈ ఆలయానికి వెళ్తే వారణాసిలో ఉన్నామా అనే అనుభూతి తప్పక కలుగుతుంది. పక్కనే సముద్రం ఉన్నా.. ఇక్కడి నీరు ఎప్పుడూ తీయగా ఉంటుంది. స్వయంగా శ్రీరాముడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం కోసం గంగమ్మను భూమి మీదకు తీసుకొచ్చాడు. గంగా తీరం చుట్టూ దాదాపు 50 ఆలయాలు నిత్యం పూజలు అందుకుంటున్నాయి. అంతటి పురాతన ప్రసిద్ధిచెందిన ఆలయం మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొలువై ఉంది. బిజీబిజీ నగరంలో ప్రజలకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తూ ప్రశాంత వాతావరణాన్ని అందిస్తోంది.

know about famous walkeshwar temple and banganga tank in mumbai

తెలుగువాసులు ఉద్యోగరీత్యా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలు సంచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా పర్యాటక ప్రియులు కొత్త ప్రాంతాలను సందర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారు వినూత్న అనుభూతిని పొందేందుకు ఈ ఆలయం సందర్శించాల్సిందే. ఈ వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం..


ముంబైలోని వల్కేశ్వర్‌ ఆలయం బాణగంగా ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత పురాతనమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. మలబార్‌ హిల్స్‌ ప్రాంతంలోని ఈ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని ముంబై కాశీ(మినీ బనారస్‌)గా పిలుచుకుంటారు. అసలు ఈ ఆలయానికి వల్కేశ్వర్‌ ఆలయం, బాణగంగాగా పేరెలా వచ్చింది.? ఇక్కడ తెలుసుకుందాం..


సీతాదేవి అన్వేషణలో శ్రీరాముడు

పురాణ గాథల ప్రకారం.. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణ సమేతంగా సీతాదేవిని వెతుకుతూ లంకకు చేరుకునే మార్గంలో ఇక్కడ కొంతకాలం నివసించాడు. అక్కడే సముద్ర తీరంలో పరమశివుడిని పూజించాలనే ఆలోచనతో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాలని లక్ష్మణుడిని ఆదేశిస్తాడు. అయితే లక్ష్మణ రాకకు ఆలస్యం కావడంతో ఇక్కడే సముద్రతీరంలోని ఇసుకతో శివలింగాన్ని చేసి రామచంద్రస్వామి పూజించాడు. సంస్కృతంలో ఇసుకను వాలుకా అని పిలుస్తుండటంతో కాలక్రమేణా ఈ ఆలయానికి వల్కేశ్వర్‌ అని పేరు వచ్చింది.

బాణగంగా ఆవిర్భావం..

శివలింగం పూర్తయిన తర్వాత అభిషేకానికి సముద్రపు నీరు ఉప్పగా ఉంటాయని భావించిన శ్రీరాముడు తన బాణంతో భూమిలోకి ఎక్కుపెట్టాడు. ఆ బాణం పాతాళంలోకి దూసుకుపోవడంతో లోపలి నుంచి గంగానది పాయ పైకి ఉబికి వచ్చింది. ఆ నీటితో శివయ్యకు అభిషేకం చేయడంతో పాటు తన దాహార్తిని తీర్చుకున్నాడు. అలా అక్కడ సరస్సు ఏర్పడగా బాణగంగగా పిలుచుకుంటున్నారు. సముద్రానికి ఈ సరస్సు అతి సమీపంలోనే ఉన్నా.. ఇక్కడ నీరు ఎప్పుడూ తీయగా, స్వచ్ఛంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు.


కాలక్రమేణా ముంబై ప్రాంతాన్ని సిల్హార రాజవంశానికి చెందిన లక్ష్మణ ప్రభు పాలిస్తుండగా.. వల్కేశ్వర్‌ ప్రత్యేకత ఆయన దృష్టికి చేరడంతో ఇక్కడ ఆలయాన్ని, చెరువును నిర్మించి ఆధ్యాత్మిక ప్రాంతంగా మలిచారు. తర్వాత 16వ శతాబ్దంలో పోర్చుగీసుల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసం కాగా.. 18వ శతాబ్దం ఆరంభంలో రామ కామత్‌ అనే భక్తుడి ఆర్థిక సాయంతో వల్కేశ్వర్‌ ఆలయం తిరిగి జీవం పోసుకుంది.


చెరువు చుట్టూ ఆలయాలు

బాణగంగా సరస్సు చుట్టూ దాదాపు 50 ఉపఆలయాలు ఉన్నాయి. ఇంకా ధర్మశాలలు ఉన్నాయి. అంతేకాకుండా సరస్సు చుట్టూ కాశీ ఘాట్ల మాదిరిగా ఇక్కడ అందమైన రాతి మెట్లు ప్రత్యేకత. ఇక్కడ పవిత్ర స్నానాలతో పాటు పితృకార్యాలు ఆచరిస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.

Story first published: Friday, May 29, 2026, 11:00 [IST]
Desktop Bottom Promotion