Puri Rath Yatra 2025: ఇంట్లోనే ఇలా చేస్తే..పూరీ రథయాత్రలో పాల్గొన్నంత పుణ్యం!

ఆషాఢ మాసపు శుక్ల పక్ష విదియ తిథి రాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హృదయాలు పులకించిపోతాయి. ఆ రోజున జరిగే కన్నుల పండువ పూరీ జగన్నాథ రథయాత్ర.పూరీ నగరంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఆ అపురూప దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. రథ చక్రాల గలగలలు, గంటల సవ్వడులు, జై జగన్నాథ్ అనే భక్తకోటి నినాదాలతో పూరీ వీధులు మార్మోగుతాయి.ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని ఆ రథాల తాడును పట్టుకుని లాగి జన్మ ధన్యమైనట్లు భావిస్తారు.

ఈ ఏడాది జూన్ 27 నుంచి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. జులై 5న ముగుస్తుంది. అయితే ఎందరో భక్తులు దూరం, అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల పూరీ రథయాత్రకు యాత్రకు హాజరుకాలేకపోవచ్చు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే స్వామి దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయామే అని అస్సలు చింతించకండి. పూరీ వెళ్లలేకపోయినా, మీ ఇంట్లోనే ఉండి ఆ జగన్నాథుని పూర్తి ఆశీస్సులు ఎలా పొందాలో ఇక్కడ చూడండి.

Puri Rath Yatra 2025 Here s How to Get Lord Jagannath s Full Blessings from Home

ఇంట్లోనే ఇలా చేస్తే రథయాత్రలో పాల్గొన్నంత పుణ్యం

ఈ మంత్రాలను జపించాలి
నేటి టెక్నాలజీ యుగంలో పూరీ రథయాత్రను అనేక టీవీ ఛానెళ్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఆ సమయంలో మీ పనులన్నీ పక్కనపెట్టి కుటుంబంతో కలిసి ఆ అద్భుత దృశ్యాలను వీక్షించండి. కేవలం చూడటమే కాకుండా మీ మనసును పూర్తిగా స్వామిపై లగ్నం చేసి ఆయన్ను ధ్యానించండి. రోజంతా జై జగన్నాథ్ లేదా 'హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే'అనే మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇది మీకు యాత్రలో పాల్గొన్నంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

జగన్నాథుని ఆరాధన
మీ పూజా మందిరంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను లేదా చిత్రపటాలను ఏర్పాటు చేసుకోండి. రథయాత్ర రోజున ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి తాజా పువ్వులు, తులసి దళాలతో స్వామిని అలంకరించి మనసారా పూజించండి. స్వామికి కిచిడీ, దాల్మా, ఛెన్నా పోడా (తీపి వంటకం) వంటి సాంప్రదాయ నైవేద్యాలు అత్యంత ప్రీతికరం. వీటిలో ఏదైనా ఒకటి మీ శక్తి మేరకు తయారు చేసి భక్తితో సమర్పించండి.

భజన, కీర్తన,దానధర్మాలు
భక్తిలో శ్రవణం ఒక ముఖ్యమైన భాగం. రథయాత్రకు సంబంధించిన పౌరాణిక గాథలను, జగన్నాథుని లీలలను చదవండి లేదా వినండి. ఇది మీలో భక్తిని పెంపొందించడమే కాకుండా ఇంట్లో సకల శుభాలు కలుగజేస్తుంది. అలాగే,ఈ పవిత్రమైన రోజున మీ శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా ధనసహాయం చేయండి. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు మీరు చేసే దానం నేరుగా ఆ భగవంతునికే చెందుతుంది. వీలైతే ఈ రోజున ఉపవాసం ఉండి స్వామి సేవలో గడపడం వల్ల మనసు, శరీరం రెండూ పవిత్రమవుతాయి. శారీరకంగా మనం పూరీలో లేకపోయినా, మన మనసును, ఆత్మను స్వామి పాదాల చెంత ఉంచితే ఆయన కరుణా కటాక్షాలు మనపై తప్పక ప్రసరిస్తాయి. మీ ఇల్లే ఒక పూరీ క్షేత్రంగా భావించి భక్తిశ్రద్ధలతో ఈ పనులు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

Story first published: Friday, June 27, 2025, 11:27 [IST]
Desktop Bottom Promotion