6 వారాలుగా సొంత విమానంలో వాడపల్లికి బెంగళూరు వ్యాపారి, ఈ ఆలయ విశిష్టత తెలిస్తే మీరూ వెళ్తారు

పాత తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. స్వయంభూ ఆలయంగా చెప్పే ఈ శ్రీవారి సన్నిధిని సందర్శిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కలియుగంలో మానవులను ధర్మమార్గంలో నడిపించడానికి మహావిష్ణువు మొదట తిరుమలలో, ఆ తర్వాత వాడపల్లిలో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 వారాల పాటు క్రమం తప్పకుండా వచ్చి.. 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Significance Of Vadapalli Venkateshwara Swami Temple In East Godavari District AP

ఈ ఆలయ విశిష్టత గురించి మరోసారి చర్చించుకోవడానికి కారణం.. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారం 7 వారాలుగా వాడపల్లికి వస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక ప్రైవేటు విమానంలో వస్తున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. బెంగళూరు నుంచి సొంత విమానంలో రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వాడపల్లికి చేరుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నారు. వాడపల్లి క్షేత్రానికి 7 శనివారులు దర్శించుకుని, 11 ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలను స్వామి వారు నెరవేరుస్తారని విశ్వసిస్తారు. శనివారాల్లో వాడపల్లి వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది.


ఆలయ విశిష్టత

ఆ ఆలయంలోని మూల విరాట్టు రాతి శిలకు బదులుగా ఎర్ర చందనంతో తయారు చేసి ఉంటుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కల్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తుంటారు. వాడపల్లి క్షేత్రంలో గోదా కల్యాణం చేస్తే.. పెళ్లి కాని వారి త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్మకం. ఇక్కడి పుణ్య క్షేత్రంలో విష్ణువుకు నారదుడే వెంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు స్థానికులు చెబుతారు.


వాడపల్లి ఆలయ స్థల పురాణం:

సనక సనందనాది మహర్షులు అందరూ వైకుంఠంలోని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయనను స్తుతిస్తారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తోందని, ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారని, వారిని సన్మార్గంలో నడిపించే ఉపాయం సెలవివ్వాలని శ్రీ మహావిష్ణువును అడుగుతారు. అప్పుడు శ్రీవారు కలియుగంలో భక్తులను ఉద్ధరించేందుకు మొదటగా తిరుమలలో.. ఆ తర్వాత దక్షిణ గంగగా పేరొందిన గౌతమీ గోదావరి తీరంలో నౌకపురం(వాడపల్లి)లో అవతరిస్తానని వారికి అభయమిస్తారు.

అలా మహర్షులు ఎర్రచందనంతో స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసి దానిని ఓ పేటికలో ఉంచి గౌతమీ నది ప్రవాహంలో వదిలేయగా.. ఆ పేటిక వాడపల్లికి చేరుకుంటుంది. వాడపల్లి ప్రాంతంలో తన విగ్రహం కనిపిస్తుందని ఓ బ్రాహ్మణుడి కలలో కనిపించి శ్రీవారు చెబుతారు. మంగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళ్తే కృష్ణ గరుడ వాలిన చోట చందన పేటిక దొరుకుతుందని చెబుతారు. ఆ పేటికను తీరానికి తీసుకువచ్చి తెరవగా అందులో శంఖు, చక్రాలు ధరించి లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపిస్తుంది. స్వయంగా నారదుడే వచ్చి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించాడని స్థల పురాణం చెబుతోంది.

వాడపల్లి క్షేత్రాన్ని వరుసగా 7 శనివారాలు సందర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తే కోరికలను స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు.

వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన|
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి||

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Monday, July 24, 2023, 10:27 [IST]
Desktop Bottom Promotion