Himalayas: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన..హిమాలయాలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలు

హిమాలయాలు అంటే కొందరికి మంచు అందాలు గుర్తుకువస్తాయి..మరికొందరికి ప్రముఖ పుణ్యక్షేత్రాలు గుర్తుకువస్తుంటాయి. దేవతల నివాసం అని కూడా పిలువబడే హిమాలయాలను ఆధ్యాత్మికతకు కేంద్రంగా భావిస్తారు. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా హిమాలయాలలోని కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలని కోరుకుంటారు. అయితే వీటిలో చాలా ప్లేస్ లకు వెళ్లడం గతంలో కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈజీగా వెళ్లగలిగే హిమాలయాలలోని కొన్ని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏవో ఇక్కడ చూడండి.

అమర్ నాథ్ గుహ (జమ్మూ కశ్మీర్)
హిమాలయాలలోని అమర్ నాథ్ గుహ భారతదేశంలోని అత్యంత రహస్యమైన,ఆధ్యాత్మిక, మతపరమైన ప్రదేశాలలో ఒకటి. ఓ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగానికి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. హిమాలయాలలో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3888 మీటర్ల ఎత్తులో శ్రీనగర్ కి 141 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. అమర్‌నాథ్ గుహలో మంచుతో ఉన్న పవిత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా జూన్,ఆగస్టు మధ్య లక్షలాది మంది హిందువులు వెళ్తుంటారు.

spiritual destinations to visit in the Indian himalayas

బద్రీనాథ్ (ఉత్తరాఖండ్)
విష్ణువుకు అంకితం చేయబడిన బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం భారతదేశంలోని చార్ ధామ్ లలో ఒకటి. చార్ ధామ్ హిందువుల ముఖ్యమైన యాత్రలలో ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల మధ్యన ఉండే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు, ఆధ్యాత్మిక సాధకులు వస్తుంటారు.

కేదార్ నాథ్ (ఉత్తరాఖండ్)
మరో చార్ ధామ్ గమ్యస్థానమైన కేదార్ నాథ్ శివునికి అంకితం చేయబడిన పవిత్ర పుణ్యక్షేత్రం. 3583 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య దివ్య వాతావరణాన్ని అందిస్తుంది. భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కేదార్ నాథ్ పరిగణించబడుతుంది.

తుంగనాథ్ (ఉత్తరాఖండ్)
శివుడికి అంకితం చేయబడిన పంచ కేదార్ ఆలయాలలో తుంగనాథ్ ఒకటి. హిమాలయాల నడిబొడ్డున 3680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మికులకే కాదు పర్యాటకులకు కూడా చాలా బాగా నచ్చుతుంది.

కైలాస మానస సరోవరం (టిబెట్)
హిందువులు,బౌద్ధులు, జైనులు దైవంగా భావించే కొన్ని ప్రదేశాలలో కైలాస పర్వతం ఒకటి. ఇది శివుని నివాసంగా భావిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం ఇది టిబెట్ లో ఉంది. కైలాస మానస సరోవర యాత్రను జీవితంలో ఒక్క సారైనా చేయాల్సిన తీర్థయాత్రగా చెబుతారు. ఎవరైనా సరే మానస సరోవరం సరస్సు మట్టిని తాకితే చాలు బ్రహ్మ సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని సరస్సు నీటిని తాగిన వ్యక్తి శివుడు సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం.

జోషిమఠ్(ఉత్తరాఖండ్)
జోషిమఠ్ హిందూ ఆధ్యాత్మికతకు ఒక ముఖ్యమైన కేంద్రం..ఎందుకంటే ఇది శంకరాచార్య మఠానికి నిలయం. ఇది ఆధ్యాత్మిక కేంద్రాలైన ఔలి, బద్రీనాథ్, ప్రసిద్ధ నర్సింగ్ ఆలయానికి ట్రెక్కింగ్ చేయడానికి ప్రవేశ ద్వారం.

గ్యాంగ్ టక్ (సిక్కిం)
సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో రుమ్ టెక్,ఎంచీ మఠాలతో సహా అనేక బౌద్ధ మఠాలు ఉన్నాయి. నగరం ప్రశాంతమైన వాతావరణం సందర్శకులకు ఆధ్యాత్మిక స్వర్గధామంగా మారుతుంది.

స్పితి వ్యాలీ(హిమాచల్ ప్రదేశ్)

స్పితి లోయ హిమాలయాలలోని ఏకాంత ప్రాంతాలలో ఉన్న మరొక ఆధ్యాత్మిక గమ్యస్థానం. ఈ మారుమూల ఎడారి.. బౌద్ధ మఠాలు, పురాతన దేవాలయాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.

Desktop Bottom Promotion