అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు తీర్థయాత్రలకి వెళ్ళిన ఘట్టము.

పరమేశ్వరుని వరప్రభావముతో సాక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణం. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపది పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసార జీవనములో వారు పాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు!

‘ఓ పాండవులారా! విమలబుద్దితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమంగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంత:పురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి'. పాండవులందరూ నారుదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరిసావహిద్దామని నిశ్చయించుకున్నారు.

ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుంఖ:మునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనస్సు ధర్మ రాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంత:పురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు అత్మ రక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.

The Story of Arjuna's Tirtha-yatra and Indraprastha

తర్వాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మ రాజు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడు ఇలా అన్నాడు, సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనుక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం"?

అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు‘అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో(వంకతో)నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుమతి ఇవ్వండి'. తమ్ముని పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేకపోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తర్వాత ఆచార్యుల పెద్దల అనుమితి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని తీర్థాలూ సేవించి పావనుడైనాడు.

ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం:

కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్యపాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షన చేశాడు. తనంతట తాను వెళ్ళి తన తప్పుకు ప్రాయశ్చత్తము చేసుకునే అవకాశమియ్యమని ధర్మ రాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు...

Story first published: Wednesday, April 1, 2015, 16:40 [IST]
Desktop Bottom Promotion