రాహు- కేతు దోషంతో జీవితంలో అడ్డంకులు.. ఈ ఆలయాల సందర్శనతో ఉపశమనం

హిందూ పురాణాలు, జ్యోతిష్యశాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. వీటికి భౌతిక రూపాలు ఉండవు. జాతకంలో రాహు- కేతువుల ప్రభావం వల్ల జీవితంలో అడ్డంకులు వస్తాయని.. అందుకే తాము అనుకున్న పనులు నెరవేరడం లేదని విశ్వసిస్తారు. అయితే ఈ గ్రహ దోషాలతో ఉన్నవారికి పరిష్కారం ఉంది. ఈ దోషాన్ని తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు, రాహు- కేతు సర్ప సూక్త జపాలు, నవగ్రహ పూజలు వంటివి చేస్తుంటారు. అందుకే మన దేశంలోని ఐదు ప్రసిద్ధ దేవాలయాలు ఈ దోష నివారణ పూజలకు ప్రసిద్ధి చెందాయి. మీరూ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ ఆలయాల గురించి తెలుసుకోండి.

visit these temples to get rid of rahu ketu dosha

రాహు- కేతువు దోషాలతో జీవితంలో గందరగోళం, ఆకస్మిక అడ్డంకులు, భావోద్వేగ ఒత్తిడి, ఒడుదొడుకులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. ఒక్కసారి ఈ ఆలయాలను సందర్శించి వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఆధ్యాత్మిక శాంతి కోరుకునేవారు విశ్వాసంతో ఈ దేవాలయాలను సందర్శిచండం ద్వారా తమ జీవితంలో ప్రతికూల ప్రభావాలను తొలుగుతాయని చాలా మంది విశ్వసిస్తారు. మరి ఆలయాలేంటో ఇక్కడ చూద్దాం.

1. ఉత్తరాఖండ్‌లోని రాహు దేవాలయం

దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్‌లో రాహు దేవాలయం కొండల మధ్య నెలకొని ఉంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణంతో పాటు శాంతియుతమైన పరిసరాలు మనలోని ప్రతికూల ప్రభావాలను తొలగిస్తాయట. రాహు దోషంతో బాధపడేవారు.. ధ్యానం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక కర్మకాండల కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల రాహువు ప్రభావంతో ముడిపడి ఉన్న ప్రతికూలత, గందరగోళం, అడ్డంకులను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం కూడా మానసిక శాంతికి దోహదపడుతుంటుందని భక్తులు విశ్వసిస్తారు.

2. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయం దక్షిణ కైలాస్‌గా ప్రసిద్ధి. రాహు-కేతు దోష పరిహారాలకు ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. శివునికి అంకితమైన ఈ ఆలయంలో.. ఆ ఆదిదేవుడిని కాలాహస్తీశ్వర రూపంలో భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో రాహు కేతువులకు సంబంధించిన ప్రత్యేక పూజలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. వందల సంఖ్యలో భక్తులు ఈ పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ రాహు- కేతు దోష నివారణ పూజల ద్వారా ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

visit these temples to get rid of rahu ketu dosha

3. తిరునాగేశ్వరం నాగనాథర్ ఆలయం
తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కొలువైన తిరునాగేశ్వరం నాగనాథర్ ఆలయం "రాహు స్థలం"గా కూడా ప్రసిద్ధి. ఇక్కడ శివుడు నాగనాథర్‌గా, పార్వతీ దేవి పిరైసూడి అమ్మన్‌గా నిత్యం పూజలందుకుంటుంది. రాహువుతో సంబంధం ఉన్న ముఖ్యమైన నవగ్రహ ఆలయాల్లో ఈ గుడి ఒకటి. రాహు దోష నివారణ పూజలతో ఈ ఆలయం ఎప్పుడూ భక్తుల రద్దీతో ఉంటుంది.

4. శ్రీ నాగనాథస్వామి కేతు దేవాలయం
తమిళనాడులోని కీజపెరుంపళ్లంలో కేతు గ్రహంతో ముడిపడి ఉన్న శ్రీ నాగనాథస్వామి కేతు దేవాలయంలో శివుడు నాగనాథ స్వామిగా పూజలందుకుంటాడు. ఇక్కడ నిత్యం కేతు దోషానికి సంబంధించిన ఆచారాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో, పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కేతు పూజలు చేయించుకుంటారు.

5. తెలంగాణలోని రాహు-కేతు ఆలయం
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయంలో 'స్వయంభు రాహు-కేతు సర్ప శయన మందిరం’ కొలువై ఉంది. ఈ ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కేవలం 20 నిమిషాల దూరంలో ఉండటంతో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జాతకంలో రాహు- కేతు దోషాలు, కాలసర్ప దోషం ఉన్నవారు ప్రధానంగా ఆదివారం, గురువారం ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొంటారు.

Desktop Bottom Promotion