తొలిఏకాశి ఎలా వచ్చిందో తెలుసా..? ఆ రోజు ఈ పనులను అస్సలు చేయకూడదు..!

రేపే తొలిఏకాదశి, మరి ఆ తొలిఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు, ఎటువంటి పదార్ధాలను ఇండ్లో వండుకోవద్దో తెలుసుకుందాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెబుతారు. దీనికి శయని ఏకాదశి, హరివాసం, పీర్ల పండగ అని పేర్లు కూడా వున్నాయ్. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటాడు. అలా నాలుగు నెలలపాటు పడుకొని అక్టోబర్ లేదంటే నవంబర్ నెలలో మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసులుగా చెబుతారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలను చేపడతారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద వుండి కార్తిక పౌర్ణమిరోజు తిరిగి వస్తారని పురాణ గాథ వుంది.

rules to be followed on tholi ekadashi

ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయ్. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయ్. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు కూడా చాలా వరకు పాటించాల్సి వుంటుంది. అందుకే పెద్దలు ఈ కాలంలో వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఏకాదశి రోజన వున్న విశిష్టతను ఒకసారి గమనిస్తే గనుక కృతా యుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో రుషులను, మునులను హింసించడంతో శ్రీమహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ వుండగా శ్రీ మహావిష్ణువు నుంచి ఒక కన్య ఆవిర్భవించి మురాసుడిని అంతం చేసింది. దీనికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా ఒక వరం కోరుకోమని అడుగుతాడు. దానికి ఆ కన్య..తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని శాస్త్రం, పురాణాలు మనకు చెబుతున్నాయ్.

ఆనాటి నుంచి రుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఆరోజు భక్తితో ఉపవాసం వుండి రాత్రంతా జాగారణ చేసి భాగవత పురాణం, విష్ణు సహస్రనామం చదువుంటే గనుక మీరనుకున్నవన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. తరువాత రోజు ద్వాదశి రోజున దగ్గరలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.

తొలి ఏకాదశి రోజు ఆవులను పూజించాలి. ఈ రోజు విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే ఆ విష్ణు మూర్తి ఆశీస్సులు తప్పుకండా లభిస్తాయ్. తొలిఏకాదశి రోజున పేలాల పిండిని కూడా తప్పకుండా తినాలని చెబుతుంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. మనకు జన్మినిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తుచేసుకోవడం కూడా మన బాధ్యత. ఆరోగ్యపరంగా బయట వాతావరణ మార్పుల వల్ల శరీరం అనేక మార్పులకు గురౌతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తరువాత వర్ష రుతువు ప్రారంభమౌతుంది. శరీరానికి ఈ పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. కాబట్టి దేవాలయాల్లో కూడా ఈ పేలాల పిండినే ప్రసాదంగా పంచిపెడతారు.

ఇంతటి పవిత్రమైన ఏకాదశిరోజున వ్రతాన్ని ఆచరిస్తే భూమి దానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60వేల సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయ్. మహాసాధ్వి సక్కుబాయ్ ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందిన విషయం మనకు తెలిసిందే. ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు దశమి రోజు రాత్రి ఏమీ తినకుండా వుండి, ఏకాదశి రోజుల కాలకృత్యాలను తీర్చుకొని శ్రీమహావిష్ణువును పూజించాలి.

ఏకాదశి రోజున ఉపవాసం వుండాలి, అసత్యాలు చెప్పకూడదు, స్త్రీ సాంగత్యం కూడా చేయవద్దు. ఎలాంటి దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి. మరుసటి రోజున ద్వాదశి రోజున కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శ్రీవారికి పూజించి నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని ముందుగా తీసుకోవాలి. ఆరోజు అన్నదానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు కాల్చి వండినవి కానీ, మాంసాన్ని, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరికాయ, ఉలవలు అస్సలు తీసుకోకూడదు. మంచంపై శయనించడం కూడా చేయవద్దని పురాణాలు మనకు చెబుతున్నాయ్. వ్రతం పాటించేవారు మాత్రమే కాదు వారి ఇంట్లో కూడా మాంసం వండకూడదు. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతాన్ని అవలంబించే వారు శాఖాహారులై ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ నాలుగు నెలలు మాంసాహారం జోలికి వెళ్లకూడదు.

Story first published: Tuesday, July 16, 2024, 17:19 [IST]
Desktop Bottom Promotion