సైలెంట్ కిల్లర్స్ గుప్పిట్లో తెలంగాణ..హైదరాబాద్‌ లో భారీగా ఊబకాయం కేసులు.. వరంగల్‌ లో హైబీపీ!

ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గాల్లో కలుస్తోందా? మారుతున్న జీవనశైలి మన పాలిట శాపంగా మారుతోందా? అవుననే అంటోంది ఆపోలో హాస్పిటల్ రిలీజ్ చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026(Health of the Nation 2026)రిపోర్ట్. దేశవ్యాప్తంగా 37.5 లక్షల మందికి నిర్వహించిన ముందస్తు ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందిన ఈ రిపోర్ట్.. తెలంగాణతో పాటు దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సంచలన విషయాలను, హెచ్చరికలను వెల్లడించింది.

ఈ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌ లో స్క్రీనింగ్ చేసిన వారిలో ఏకంగా 81.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. 2025లో ఈ సంఖ్య 63 శాతంగా ఉండగా, కేవలం ఏడాది వ్యవధిలో ఇంతలా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

The IT Hub is Now India s Obesity Capital Shocking Apollo Report on Hyderabad

ఐటీ హబ్‌ లో బరువైన సమస్య
హైదరాబాద్ అనగానే ఐటీ హబ్, బిర్యానీ గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడు ఈ మహానగరం ఊబకాయానికి అడ్డాగా మారుతోంది. అపోలో రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌ లో పరీక్షలు చేయించుకున్న వారిలో ఏకంగా 81.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. 2025లో ఈ సంఖ్య 63 శాతంగా ఉండగా, కేవలం ఏడాది వ్యవధిలో ఇంతలా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్‌కు బానిసవ్వడం యువతను రోగాల బారిన పడేస్తున్నాయి. ఇది భవిష్యత్తులో డయాబెటిస్, గుండె, కాలేయ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర నగరాలతో పోలిస్తే..
ఊబకాయం ముప్పులో దేశంలోని మెట్రో నగరాల్లో ముంబై (81.6శాతం) తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీతో సమానంగా 81.3 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. కోల్‌ కతాలో 78.4 శాతం, బెంగళూరులో 77.8 శాతం, చెన్నైలో 77.3 శాతం చొప్పున నమోదయ్యాయి.

The IT Hub is Now India s Obesity Capital Shocking Apollo Report on Hyderabad

వరంగల్‌ లో బీపీ, షుగర్ భయం
తెలంగాణలోని మరో ప్రధాన నగరమైన వరంగల్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. రాష్ట్ర సగటు రక్తపోటు (BP) రేటు 27.3 శాతం కాగా.. వరంగల్‌ లో ఇది ఏకంగా 52.6 శాతానికి చేరింది. అంటే అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి బీపీ ఉందన్నమాట.

ఇక డయాబెటిస్ విషయానికొస్తే హైదరాబాద్‌ లో 25.3 శాతం ఉండగా, వరంగల్‌ లో 28.8 శాతంగా ఉంది. ఈ రెండు నగరాల్లో 70.6 శాతం మంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోగా, 22 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

వృద్ధాప్య వ్యాధులు యువతకే..
దేశవ్యాప్తంగా చూస్తే.. ముగ్గురు యువకుల్లో ఇద్దరు నాన్ కమ్యూనికబుల్ (NCD) వ్యాధుల ముప్పులో ఉన్నారు. 30 ఏళ్ల లోపు వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉండగా.. ఉద్యోగుల్లో సగం మందికి షుగర్ ముప్పు ఉంది. ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉండగా, 10 మందిలో 8 మంది అధిక బరువుతోనే ఉన్నారు.

విటమిన్ల లోపం.. సైలెంట్ క్యాన్సర్లు
భారతీయుల్లో 70 శాతం మందికి విటమిన్-D, సగం మందికి విటమిన్-B12 లోపం ఉంది. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి 359 మందిలో ఒకరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడింది. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో 74 శాతం మందికి రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చినా, లోపల సమస్య దాగి ఉండటం గమనార్హం. 92 శాత మంది జీర్ణకోశ సమస్యలతో, ప్రతి 15 మందిలో ఒకరు డిప్రెషన్‌తో, 10 మందిలో ఒకరు ఆందోళనతో సతమతమవుతున్నారు.

మరి పరిష్కారం లేదా?
ఇన్ని భయపెట్టే విషయాల మధ్య ఒక ఊరటనిచ్చే అంశం.. ముందస్తు పరీక్షలు. రెగ్యులర్‌ గా ఫాలో అప్ చెకప్‌ లు చేయించుకున్న వారిలో 56 శాత మంది బీపీని కంట్రోల్ చేసుకోగా, 34శాత మంది షుగర్ తగ్గించుకున్నారు. 26 శాత మంది బరువు తగ్గారు.

అపోలో నివేదిక మనకు ఒక పెద్ద మేలుకొలుపు. జీవనశైలి మార్పుల ద్వారానే ఈ సమస్యను అధిగమించగలం. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం, ఇంట్లో వండిన సమతులాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, మొబైల్ వాడకాన్ని తగ్గించి కంటినిండా నిద్రపోవడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion