ఏపీలో ఘోరం- 15 మందికి పైగా దుర్మరణం?

By Chandrasekhar Rao

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.

ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరూ చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులుగా గుర్తించారు. వారి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోన్నారు.


Private Bus Plunges into Valley in Alluri District of Andhra Pradesh several feared dead

చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు యాత్రికులు ప్రైవేట్ బస్సు (నంబర్ ఏపీ 39 యూఎం 6543) లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన కోసం బయలుదేరారు. గురువారం రాత్రి భద్రాచలం ఆలయ దర్శనానంతరం అన్నవరానికి బయలుదేరారు. చింతూరు- మారేడుమిల్లి మీదుగా అన్నవరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మలుపులో అదుపు తప్పింది. చూస్తుండగానే 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడింది. మొత్తం నుజ్జునుజ్జు అయింది. యాత్రీకులు నలిగిపోయారు. వారిలో 15 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కొందరు కిటికీల గుండా బయటపడ్డారు.

ఒకవైపు చలి, మరోవైపు చీకట్లో నరకాన్ని చవి చూశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేస్తోన్నారు. మరోవంక.. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి.

Credit: Oneindia

Desktop Bottom Promotion