ఆంధ్రా స్పెషల్ గోంగూర పచ్చడి..ఇడ్లీ, దోశె, అన్నంలోకి దేనితో తిన్నా అమృతమే..ఎలా చేయాలంటే

Posted By:

గోంగూరకు,ఆంధ్రాకు విడదీయలేని అనుబంధం ఉంది. గోంగూరను ఆంధ్రమాత అని కూడా పిలుస్తుంటారు..శాకంబరీ దేవీ ప్రసాదం అని కూడా గోంగూరను చెబుతుంటారు. గోంగూర రుచి చూడని తెలుగువారు ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. అయితే గోంగూరను ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఓ సారి స్పెషల్ గా పల్లీలు, నువ్వులతో కలిపి ట్రై చేసి చూడండి. ఈ స్పెషల్ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశెలోకి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ముందుంటుంది. ఈ పచ్చడిని వారం రోజుల వరకు ఫ్రిజ్‌ లో నిల్వ చేసుకోవచ్చు. దాని పోషక విలువలను పూర్తిగా పొందడానికి తాజాగా తయారుచేసుకుని తినడం మంచిది. ఆంధ్రా స్పెషల్ గోంగూర పల్లీ నువ్వుల పచ్చడిని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోంగూర పల్లీ నువ్వుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-నువ్వులు
-పల్లీలు
-నూనె
-ధనియాలు
-ఆవాలు
-జీలకర్ర
-గోంగూర ఆకు
-పచ్చి శెనగపప్పు
-కరివేపాకు
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-ఎండుమిర్చి
-ఇంగువ

Andhra special gongura palli nuvvula pachadi recipe in telugu

గోంగూర పల్లీ నువ్వుల పచ్చడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి చిట్లినిచ్చాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి తక్కువ మంట మీద నువ్వులను కూడా చిట్లనివ్వాలి.

-తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వేయించిన నువ్వులు,పల్లీలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద కడాయిలో పావు కప్పు నూనె వేడి చేసి ఇందులో పిడికెడు వెల్లుల్లి రెబ్బలు వేసి పొంగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 15 పచ్చిమిరపకాయలు వేసి ఇవి మెత్తబడి,రంగుమారేదాకా వేయించాలి.

-మిరపకాయ రంగు మారాక అందులో 2 పెద్ద పిడికెళ్ల గోంగూర ఆకు అందులో వేసి 2 నిమిషాలు అలా వదిలేయండి.

-తర్వాత మూతతీసి బాగా కలిపి 1 నిమిషం పాటు మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులో వేసి ఆపి ఆపి గ్రైండ్ చేసుకోండి లేదా రోట్లో దంచుకోవచ్చు. కాస్త బరకగా ఉండాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అర టీస్పూన్ ధనియాలు నలిపి వేయండి,అర టీస్పూన్ ఆవాలు,అర టీస్పూన్ జీలకర్ర,2 ఎండు మిరపకాయల ముక్కలు వేసి ఇవి రంగు మారేదాకా వేయించాలి.

-ఎండుమిర్చి రంగు మారడం ప్రారంభమైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి ఎర్రబడేదాకా వేయించాలి.

-తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి బరకగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి, ప్లేట్ లో పక్కన ఉంచిన పల్లీ నువ్వుల పొడి, రుచికి తగినంత ఉప్పు, పావుటీస్పూన్ పసుపు వేసి కలిపి 2-3 నిమిషాలు ఉడికించాక 2 చెంచాల ఉల్లిపాయ తరుగు కొంచెం వేసి కలిపి స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ గోంగూర పల్లీ నువ్వుల పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 22, 2025, 16:16 [IST]
Desktop Bottom Promotion