ముక్క మెత్తగా..అన్నం పొడిపొడిగా..పర్ఫెక్ట్ రాజుల కోడి పులావ్

Posted By:

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అత్యంత ఆదరణ పొందిన వంటకం రాజుల కోడి పులావ్. దీని రుచి, సువాసన, తయారీ విధానం ఇతర బిర్యానీలు లేదా పులావ్‌ ల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని భీమవరం కోడి పులావ్ అని లేదా రాజు గారి పులావ్ అని కూడా పిలుస్తారు.

హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో, గోదావరి జిల్లాల్లో ఈ రాజుల పులావ్ అంత ప్రసిద్ధి. సాధారణంగా బిర్యానీలో బాస్మతి బియ్యం వాడితే ఇందులో చిట్టి ముత్యాల బియ్యం వాడటం దీని ప్రత్యేకత. రాజుల కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Rajula Kodi Pulao The Real Taste of Godavari Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

చికెన్: 1 కేజీ
చిట్టి ముత్యాల బియ్యం: 1 కేజీ
నూనె లేదా నెయ్యి: 150 గ్రాములు
నీళ్లు: 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు.
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు
కారం: 2 స్పూన్లు
ఉప్పు: తగినంత
పెరుగు: అర కప్పు
పసుపు: అర స్పూన్
నిమ్మరసం: ఒక చెక్క
మసాలా దినుసులు:
యాలకులు: 4-5
లవంగాలు: 6-8
దాల్చిన చెక్క: 2 అంగుళాల ముక్కలు
బిర్యానీ ఆకు: 2-3
షాజీరా: 1 స్పూన్
మరాఠీ మొగ్గ, అనాస పువ్వు: తగినంత
పచ్చిమిర్చి: 10-12
ఉల్లిపాయలు: 3 పెద్దవి
పుదీనా: ఒక కట్ట
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: 2 రెమ్మలు
జీడిపప్పు: 50 గ్రాములు

Authentic Rajula Kodi Pulao The Real Taste of Godavari Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు,పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,పెరుగు నిమ్మరసం వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టాలి.

-చిట్టి ముత్యాల బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టాలి.

-తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోవాలి. అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేశాక బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాక జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.

-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నచికెన్‌ ను వేయాలి. పెద్ద మంట మీద 5 నిమిషాల పాటు చికెన్‌ ను బాగా వేయించాలి. తర్వాత మంటను తగ్గించి మూత పెట్టి చికెన్‌ ను ఆయిల్ పైకి తేలే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి. చికెన్ 80శాతం వరకు ఇక్కడే ఉడికిపోవాలి.

-చికెన్ ఉడికిన తర్వాత అందులో బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి. చిట్టి ముత్యాల బియ్యం అయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు, కుక్కర్ అయితే 1:1.5 సరిపోతుంది. నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటేనే పులావ్ ఉడికిన తర్వాత సరిగ్గా సరిపోతుంది.

-నీళ్లు మరుగుతున్నప్పుడు న్నగా తరిగిన కొత్తిమీర, నానబెట్టిన బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం వేసాక ఒకసారి మెల్లగా కలిపి, మూత పెట్టాలి

-నీరు 90శాతం ఇగిరిపోయి, బియ్యంపై చిన్న చిన్న రంధ్రాలుగా కనిపిస్తున్నప్పుడు మంటను తగ్గించి గిన్నె కింద ఒక పాత పెనం పెట్టి గిన్నెపై బరువు పెట్టి దమ్ చేయాలి.

-సుమారు 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక వెంటనే మూత తీయకుండా మరో 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. అంతే ఘాటైన రాజుల కోడి పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, January 16, 2026, 13:08 [IST]
Desktop Bottom Promotion