వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పోషకాల గని..ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే పెసర లడ్డూ చేసుకోండిలా..

Posted By:

ఈ ఆధునిక యుగంలో ఎన్ని కొత్త వంటకాలు వచ్చినా..మన సాంప్రదాయ వంటకాల ముందు అవన్నీ దిగదుడుపే. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మల చేతి వంటల్లో ఉండే కమ్మదనం మరెక్కడా దొరకదు. అప్పట్లో వారు చేసే వంటలు కేవలం రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి పెద్ద పీట వేసేలా ఉండేవి. అలాంటి పురాతన, పోషక భరితమైన వంటకాల్లో పెసర లడ్డూ ఒకటి.

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం పెసరపప్పుకు ఉంది. పైగా ఇందులో తామర గింజలు (మఖానా), పటిక బెల్లం వాడటం వల్ల శరీరానికి మరింత మేలు జరుగుతుంది.

Grandmas Secret Recipe The Traditional Moong Dal Laddu You Must Try Recipe in Telugu

పెసలలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ B3, B5, విటమిన్ C, విటమిన్ A, విటమిన్ K లతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, ఫోలేట్ వంటి మరెన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. ఇన్ని పోషకాలున్న పెసర లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మేలు చేస్తాయి.

పెసర లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు: 200 గ్రాములు
నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు
మఖానా: 50-60 గ్రాములు
జీడిపప్పు: 12-15
బాదంపప్పులు: 8-10
యాలకులు: 4-5
పటిక బెల్లం పొడి: మీ తీపికి తగినంత

పెసర లడ్డు తయారీ విధానం

-ముందుగా పెసరపప్పును నీళ్లలో వేసి, చేతులతో సున్నితంగా రుద్దుతూ కడగాలి. ఆ తర్వాత నీరంతా వంపేసి, ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంపై పప్పును వేసి తుడిచి, కాసేపు గాలికి ఆరనివ్వాలి.

-పెసరపప్పు ఆరిన తర్వాత, మందపాటి అడుగు ఉన్న కడాయిని పొయ్యి మీద పెట్టి, పెసరపప్పును వేయాలి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి 6-7 నిమిషాల పాటు దోరగా వేయించాలి. మంట పెంచితే పప్పు మాడిపోయి, లోపల పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి ఓపికగా వేయించుకోవాలి.

-పప్పును ఒక పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొద్దిగా నెయ్యి వేడిచేయాలి. అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసర పిండిని వేసి, చిన్న మంటపై నిరంతరం కలుపుతూ వేయించాలి. కమ్మని సువాసన వస్తూ, రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-మరోసారి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో మఖానా వేసి కరకరలాడేలా వేయించి, మిక్సీలో పొడి చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను కూడా నేతిలో దోరగా వేయించుకోవాలి.

-ఇప్పుడు పూర్తిగా చల్లారిన పెసర పిండిలో.. మఖానా పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పటిక బెల్లం లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి.

-అంతే ఎంతో కమ్మని, నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర లడ్డూలు రెడీ. రోజూ ఒక లడ్డూ తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

[ of 5 - Users]
Story first published: Wednesday, April 8, 2026, 21:55 [IST]
Desktop Bottom Promotion