పిల్లల ఫేవరెట్‌ ‘ఆలూ’.. రెస్టారెంట్‌ టేస్ట్‌తో అదరగొట్టే దమ్‌ బిర్యానీ.!

చిన్నారుల నుంచి పెద్దల వరకు బంగాళాదుంపను ఇష్టపడని వారుండరు. విటమిన్లు, ఫైబర్‌, పోషకాలతో పాటు కొవ్వు రహితంగా ఉండే ఆలుగడ్డను పప్పు, సాంబార్‌, రసం వంటి వాటితో కాంబినేషన్‌గా తింటే రుచి అదిరిపోతుంది. అయితే వెజ్‌ తినని వారికోసం ఆలుగడ్డతో స్పెషల్‌ చేయాలనుకుంటే ఇలా రెస్టారెంట్‌ స్టైల్‌లో ఆలూ దమ్‌ బిర్యానీ చేసి చూడండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు.

How to prepare Restaurant style aloo dum biryani for kids and veg lovers in telugu

బంగాళాదుంపలు తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఫైబర్‌ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొటాషియం గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి6 నాడీ వ్యవస్థకు, జీవక్రియకు మేలు చేస్తుంది. మరి పోషక విలువలున్న ఆలూ దమ్‌ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

ఆలూ దమ్‌ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు

బంగాళాదుంపలు- అరకేజీ
బాస్మతి రైస్‌- అర కేజీ
అల్లం- నాలుగు చిన్న ముక్కలు
వెల్లుల్లి- పదిహేను రెబ్బలు
పచ్చిమిర్చి- ఐదు లేదా ఆరు
కారం- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- టీస్పూన్‌
జీలకర్ర పొడి- అరటీస్పూన్
కసూరి మేతి- కొద్దిగా
బిర్యానీ మసాలా- టీస్పూన్‌
ఫ్రైడ్‌ ఆనియన్‌- రెండు కప్పులు
టమాటా- రెండు మీడియం సైజు
కొత్తిమీర-కప్పు
పుదీనా- కప్పు
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
నెయ్యు- టేబుల్‌ స్పూన్‌
మసాలా దినుసులు- రెండు టేబుల్‌ స్పూన్లు
పసుపు- పావు టీస్పూన్‌
పెరుగు- పావు కప్పు
నిమ్మకాయ ముక్కలు- ఆరు
కుంకుమపువ్వు- కొద్దిగా
ఆలూ దమ్‌ బిర్యానీ తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి 80 శాతం వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీటిని పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించుకోవాలి. చివర్లో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు చల్లి పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

బాస్మతి అన్నం ఇలా వండండి..

ఇప్పుడు అన్నం వండేందుకు గిన్నె తీసుకుని అందులో రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాగా బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి మరగనివ్వాలి. అందులోనే నిమ్మకాయ ముక్కలు, కొద్దిగా నూనె వేసి మరిగాక బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అన్నం 80 శాతం ఉడికాక నీటి నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.

బిర్యానీ తయారీ కోసం పెద్ద గిన్నె తీసుకుని అందులో మిగిలిన నూనె, నెయ్యి వేసి వేగాక మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకు ఉడికించుకోవాలి. తర్వాత పెరుగు, టమాటాలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరి మేతీ, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి ఒక్కొక్కటిగా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు వేయించిన బంగాళా దుంప ముక్కలు, ఫ్రైడ్‌ ఆనియన్‌, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు మగ్గనివ్వాలి.

ఈ స్టెప్‌లోనే రుచి దాగుంది..

చివరిగా బాస్మతి అన్నాన్ని పొరలుగా వేసుకోవాలి. ఆ పొరల మధ్యలో ఫ్రైడ్‌ ఆనియన్‌, కొత్తిమీర, పుదీన వేసుకోవాలి. చివరి లేయర్‌ పైన నిమ్మకాయ రసం పిండుకోవాలి. కుంకుమపువ్వును కాసేపు నానబెట్టి ఆ నీటిని పై నుంచి చుట్టూ చల్లుకోవాలి.

ఇప్పుడు అన్నం కొంచెం పొడిగా ఉన్న కారణంగా ఒక పావు కప్పు వరకు నీటిని పై నుంచి పోసుకోవాలి. మసాలా ఫ్లేవర్‌ బయటకు పోకుండా ఉండేందుకు టిష్యూ పేపర్స్‌ని బిర్యానీ కవర్‌ చేసేలా కప్పుకోవాలి. నీటితో కొంచెం తడి చేయాలి.

ఫైనల్‌గా ఒక పెనం స్టవ్‌ పైన పెట్టి వేడయ్యాక ఈ గిన్నెను తీసుకుని దానిపైన పెట్టుకోవాలి. డైరెక్టుగా స్టవ్‌పైన పెట్టడం ద్వారా బంగాళాదుంపలు మాడే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా దాని పరిమళం పోదు. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చిన్న మంట లేదా మీడియం మంటపైన బిర్యానీ ఉడకనివ్వాలి. అంతే నాన్‌వెజ్‌ రుచిని తలపించేలా ఆలూ దమ్‌ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, July 10, 2026, 11:09 [IST]
Desktop Bottom Promotion