అరటిపండ్లు బాగా పండాయా? పారేయకండి..ఇలా కమ్మని దోసలు వేయండి

Posted By:

పిల్లల లంచ్ బాక్స్‌ లో రోజుకో వెరైటీ పెట్టడం తల్లులకు పెద్ద సవాలే. రోజూ ఒకే రకమైన టిఫిన్ పెడితే పిల్లలు తినడానికి మారం చేస్తారు. పోనీ దోసలు వేద్దామంటే..దోస అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కారంగా ఉండే మసాలా దోస లేదా పప్పులతో చేసిన సంప్రదాయ దోసలే. కానీ ఎప్పుడైనా తీయని దోస గురించి విన్నారా? అదే అరటి దోస.

దక్షిణ భారతదేశంలో వందలాది దోస రకాలు ఉన్నప్పటికీ పిల్లల మనసు గెలుచుకునే స్పెషల్ ఐటమ్ మాత్రం ఈ అరటి దోసనే. దీనిని మనం ఇన్‌ స్టంట్ పాన్‌ కేక్ అని కూడా పిలుచుకోవచ్చు. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యం పరంగా కూడా అరటి దోస చాలా మంచిది. అరటి దోస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు - 2
గోధుమ పిండి లేదా బియ్యం పిండి - 1 కప్పు
బెల్లం తురుము - రుచికి సరిపడా
యాలకుల పొడి - చిటికెడు
నూనె - కాల్చడానికి సరిపడా
నీరు - పిండి కలపడానికి

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పండిన అరటిపండ్లను వేసి ముక్కలు లేకుండా మెత్తగా గుజ్జులా చిదుముకోవాలి.

-ఆ అరటిపండు గుజ్జులో గోధుమ పిండి (లేదా బియ్యం పిండి), బెల్లం తురుము,యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ ఇడ్లీ పిండిలా గట్టిగా ఉండకూడదు, అలాగని సాధారణ దోస పిండిలా మరీ పల్చగానూ ఉండకూడదు. మధ్యస్థంగా జారుడుగా ఉంటే దోసలు మెత్తగా, ప్లఫీగా వస్తాయి.

-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయండి. పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి రాయండి. ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసుకొని పాన్‌ పై వేసి, చిన్నగా వృత్తాకారంలో పరచండి. దీనిని సాధారణ దోసలా మరీ పల్చగా రుద్దకూడదు, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది.

-మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి దోసను కాల్చాలి. ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత, మెల్లగా రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

-అంతే వేడివేడి, మృదువైన స్వీట్ బనానా దోస రెడీ. దీనిపై కొంచెం తేనె లేదా నెయ్యి వేసి పిల్లలకు లంచ్ బాక్స్‌ లో పెడితే, బాక్స్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ.

[ of 5 - Users]
Story first published: Thursday, February 5, 2026, 20:27 [IST]
Desktop Bottom Promotion