మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!

Posted By:

తమిళనాడులోని మదురై మదురై వీధుల్లో నడుస్తుంటే చాలు, ఎక్కడ చూసినా రకరకాల ఘుమఘుమలాడే వంటకాలు మనల్ని నోరూరిస్తుంటాయి. హోటల్ లేని వీధి అక్కడ దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి కాదు. మదురైలో దొరికే ఎన్నో ప్రత్యేకమైన వంటకాల్లో స్థానికులను, పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే వంటకం మటన్ దోశ. మదురై వీధుల్లోని అచ్చమైన రుచితో మీ ఇంట్లోనే ఈ మటన్ దోశను ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Madurai Famous Mutton Dosa Recipe in Telugu How To Make Spicy Crispy Mutton Keema dosa

మటన్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు

దోశ పిండి - 1 కప్పు
మటన్ కీమా (మెత్తటి మాంసం తురుము) - 200 గ్రాములు
కోడిగుడ్లు - 3
ఉల్లిపాయలు - 1
టమాటా - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - ముప్పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

మటన్ దోశ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక సోంపు గింజలు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, సువాసన వచ్చేలా వేయించాలి.

-ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జులా మారేంతవరకు ఉడికించాలి.

-టమాటాలు బాగా ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ కలిసేలా బాగా వేయించాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను అందులో వేసి మసాలాలన్నీ మాంసానికి పట్టేలా బాగా కలపాలి.

-కీమా ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి సన్నని మంట మీద మాంసం మెత్తగా ఉడికేలా చూడాలి. నీరంతా ఇగిరిపోయి, మసాలా దగ్గరపడి నూనె పైకి తేలే సమయంలో స్టవ్ ఆఫ్ చేసి దానిని పక్కన పెట్టుకోవాలి.

-ఉడికించి పక్కన పెట్టుకున్న కీమా మసాలాను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అది కాస్త చల్లారాక అందులో మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేయాలి. దీనిలోనే కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, తాజా కొత్తిమీర ఆకులు వేసి గరిటెతో బాగా గిలకొట్టినట్లుగా కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనం పెట్టి మీడియం మంట మీద వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కాక, గరిటెతో దోశ పిండిని తీసుకుని మందంగా ఊతప్పం లాగా పోయాలి. దోశ కాస్త కాలుతున్న సమయంలో, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గుడ్డు-కీమా మిశ్రమాన్ని ఒక పెద్ద గరిటెతో తీసుకుని దోశ పైన అంతటా సమంగా పరచాలి.

-దోశ చుట్టూ కాస్త నూనె చిలకరించి, పైన కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి. కింది భాగం ఎర్రగా కాలాక, చాలా జాగ్రత్తగా దోశను రెండో వైపుకు తిప్పాలి. గరిటెతో దోశను మెల్లగా అదుముతూ, కీమా మిశ్రమం బాగా ఉడికి ఎర్రగా మారేలా కాల్చుకోవాలి. మాంసం, గుడ్డు బాగా ఉడికిన సువాసన రాగానే దోశను ప్లేట్ లోకి తీసుకోవాలి.

-అంతే ఘుమఘుమలాడే అద్భుతమైన మదురై మటన్ దోశ రెడీ. వేడివేడిగా ఉన్న ఈ దోశను చికెన్ లేదా మటన్ గ్రేవీతో లేదా కనీసం ఉల్లిపాయ రైతాతో తింటుంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు.

[ of 5 - Users]
Story first published: Monday, July 20, 2026, 17:41 [IST]
Desktop Bottom Promotion