గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే!

Posted By:

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన, సులభంగా చేసుకోగలిగే వంటకం పచ్చి పులి రసం. దీనినే తెలుగు రాష్ట్రాల్లో పచ్చి పులుసు అని కూడా పిలుస్తారు.

పుల్లగా, కారంగా, తీయగా.. ఇలా అన్ని రుచుల కలయికతో నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చి పులుసు వేసవికాలంలో అమృతంలా అనిపిస్తుంది. ఈ రసం తయారు చేయడానికి ఎక్కువ సమయం, శ్రమ అవసరం లేదు. గ్యాస్ స్టవ్ ఆనే పనే లేకుండా కేవలం పది నిమిషాల్లో ఈ పచ్చి పులి రసం ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

పచ్చి పులి రసం తయారీకి కావాల్సిన పదార్థాలు

చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు
నీళ్లు - 2 లేదా 3 కప్పులు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 5
బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక చిన్న కట్ట
తాలింపు (పోపు) కోసం:
నూనె - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2 (ముక్కలుగా తుంచినవి)
వెల్లుల్లి రెబ్బలు - 4 లేదా 5 (కచ్చాపచ్చాగా దంచినవి)
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - పావు టీస్పూన్
ఇంగువ - చిటికెడు (ఇష్టమైతే)

పచ్చి పులి రసం తయారీ విధానం

-ముందుగా చింతపండును ఒక గిన్నెలో వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో గోరువెచ్చని నీళ్లు పోసి సుమారు 15 నిమిషాల పాటు నానబెట్టాలి. చింతపండు బాగా నానిన తర్వాత, చేతితో బాగా పిసికి గుజ్జును తీయాలి. పిప్పిని తీసివేసి, ఆ చింతపండు రసంలో ఇంకొన్ని నీళ్లు పోసి, రసం మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా చూసుకోవాలి.

-తర్వాత రోట్లో లేదా మిక్సీ గిన్నెలో మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి, పచ్చిమిరపకాయు, చిన్న ఉల్లిపాయలు(సాంబార్ ఉల్లిపాయలు)వేసి , ఉల్లికాడలు(స్ప్రింగ్ ఆనియన్స్), కరివేపాకు, కొత్తిమీర కాడలు వేసి ఈ మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి లేదా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు దంచుకున్న మిశ్రమాన్ని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంలో వేయాలి. ఇందులోనే కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, బెల్లం తురుము, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే పచ్చి పులి రసం రెడీ.

-దీనిని అన్నంలో కలుపుకుని తింటే స్వర్గమే.

-తెలంగాణ స్టైల్ లో కావాలనుకుంటే, ఇందులో కొద్దిగా వేయించిన నువ్వుల పొడి లేదా పల్లీల (వేరుశెనగ) పొడి కలుపుకోవచ్చు.

పచ్చి పులి రసంతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

-చింతపండు, ఉల్లిపాయలు రెండూ శరీరంలోని వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వడదెబ్బ తగలకుండా శరీరాన్ని రక్షించడంలో పచ్చి ఉల్లిపాయ, చింతపండు మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.

-ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

-రక్తపోటును (బీపీ) కంట్రోల్ చేయడంలో, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

-ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని సరిచేసి, డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది.

-జ్వరం వచ్చి నోరు చెడిపోయినప్పుడు కానీ, కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ, లేదా ఏదైనా పుల్లగా, కారంగా తినాలనిపించినప్పుడు కానీ పచ్చి పులుసుకు మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion