అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ

Posted By:

భారతీయ భోజనం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఘాటైన మసాలాలు, నోరూరించే పచ్చళ్లు. అందులోనూ రాజస్థాన్ వంటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్‌ లోని మార్వార్ ప్రాంతానికి చెందిన వంటకాలు వాటి ప్రామాణికమైన, కారమైన రుచులకు పెట్టింది పేరు. అలాంటి అద్భుతమైన వంటకాల్లో ఒకటే మార్వారీ ఎర్ర మిరప వెల్లుల్లి చట్నీ.

పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరేలా చేసే ఈ చట్నీ.. కారం, పులుపు, వెల్లుల్లి ఘాటు కలగలిపి అద్భుతమైన రుచిని ఇస్తుంది. రోజూ తినే సాధారణ పప్పు అన్నం, జొన్న రొట్టె, సజ్జ రొట్టె లేదా వేడి వేడి పరాఠాలతో ఈ చట్నీని కొద్దిగా నంజుకుంటే ఆ కిక్కే వేరు.

Quick And Spicy The Famous Rajasthani Marwari Garlic Red Chilli Chutney Recipe in Telugu

వెల్లుల్లి మిరపకాయ చట్నీకి కావలసిన పదార్థాలు

ఎండు మిరపకాయలు - 50 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - అర కప్పు
నూనె - అర కప్పు
అల్లం - రెండు అంగుళాల ముక్క
చింతపండు - రెండు టీస్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూన్
ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్

వెల్లుల్లి మిరపకాయ చట్నీ తయారీ విధానం

-ముందుగా అర కప్పు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని, వాటి పొట్టును శుభ్రంగా వలిచి పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కలను కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందం పాన్‌ పెట్టి అందులో అర కప్పు నూనె వేసి వేడి చేయండి.

-నూనె వేడెక్కిన తర్వాత 50 గ్రాముల ఎండు మిరపకాయలను వేసి మంటను మీడియంలో ఉంచండి. సుమారు 3 నుంచి 5 నిమిషాల పాటు మిరపకాయలను నూనెలో దోరగా వేయించాలి. అవి వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు, వాటిని నూనెలోంచి తీసి వేరొక ప్లేట్‌ లో పక్కన పెట్టుకోండి.

-అదే నూనెలో ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేయాలి. ఇవి లేత బంగారు గోధుమ రంగులోకి మారే వరకు చిన్న మంట మీద నెమ్మదిగా వేయించండి.

-వెల్లుల్లి, అల్లం బాగా వేగిన తర్వాత అందులో ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు టీస్పూన్ల చింతపండు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

-అన్నీ బాగా వేగి, చింతపండు కాస్త మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వండి. ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు మిరపకాయలతో సహా, పాన్‌ లో ఉన్న వెల్లుల్లి, చింతపండు మిశ్రమాన్ని నూనెతో సహా ఒక మిక్సీ జార్‌ లో వేసి ఎక్కడా బరకగా లేకుండా మెత్తని పేస్ట్‌లాగా రుబ్బుకోవాలి. అంతే నోరూరించే ఘాటైన రాజస్థానీ మార్వారీ వెల్లుల్లి చట్నీ రెడీ.

-ఈ చట్నీని ఒక పొడి గాజు సీసాలో లేదా ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకోండి. ఫ్రిజ్‌ లో ఉంచితే ఐదు నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. బయట ఉంచితే కనీసం ఒక నెల పాటు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, March 17, 2026, 22:34 [IST]
Desktop Bottom Promotion