హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ..ఎర్రగా, కరకరలాడుతూ కేక టేస్ట్

Posted By:

దోశలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందులోనూ మైసూర్ మసాలా దోశ అంటే ఆ క్రేజ్ వేరు. పైన బంగారు రంగులో కరకరలాడే క్రిస్పీ పొర, లోపల వెన్నలాంటి మృదుత్వం, నాలికను తాకే ఆ ఘాటైన ఎర్ర కారం, మధ్యలో నోరూరించే బంగాళాదుంప మసాలా.. అబ్బో ఈ కాంబినేషన్ తలుచుకుంటేనే ఆకలి మొదలవుతుంది.

సాధారణంగా ఇలాంటి పర్ఫెక్ట్ దోశ తినాలంటే మనం హోటల్‌ కి లేదా రెస్టారెంట్ కి వెళ్లాలని అనుకుంటాం. కానీ అసలైన మైసూర్ మసాలా దోశ రుచి రహస్యం తెలిస్తే, మీ వంటింట్లోనే హోటల్ కంటే అద్భుతమైన దోశను తయారు చేసుకోవచ్చు. హోటల్ కి మించిన రుచితో మైసూర్ మసాలా దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spicy Red Chutney and Buttery Goodness Authentic Mysore Masala Dosa Recipe in Telugu

కావలసిన పదార్థాలు
దోశ బియ్యం లేదా సోనా మసూరి బియ్యం
మినపప్పు (పొట్టు లేనిది)
మెంతులు
ఉప్పు
బంగాళాదుంపలు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
ఆవాలు
కరివేపాకు
పసుపు
నూనె.
ఎండు మిరపకాయలు
వెల్లుల్లి రెబ్బలు
చింతపండు

తయారీ విధానం

-ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పిండిని సుమారు 8 నుండి 10 గంటల పాటు పులియబెట్టాలి. పిండి ఎంత బాగా పులిస్తే, దోశ అంత రుచిగా, రంధ్రాలతో వస్తుంది. దోశ పోసే ముందు తగినంత ఉప్పు కలపండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి రాగానే పసుపు, ఉప్పు వేసి, ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కలపాలి. దీన్ని రెండు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి.

-మైసూర్ మసాలా దోశకు అసలైన రుచినిచ్చేది ఎర్ర చట్నీనే. ఇందుకోసం ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో గట్టిగా పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఇది దోశ మీద రాయడానికి వీలుగా ఉండాలి.

-స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక మంటను తగ్గించి పిండిని పల్చగా, గుండ్రంగా పరచాలి. దోశ కాస్త ఉడకడం మొదలయ్యాక తయారు చేసుకున్న స్పెషల్ ఎర్ర కారం ఒక చెంచా వేసి దోశ అంతటా ఎర్రగా కనిపించేలా రాయాలి. ఆ తర్వాత దోశపై దోశ చుట్టూ వెన్న వేయండి. వెన్న వాడితే రుచి రెట్టింపు అవుతుంది.

-దోశ బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయినప్పుడు మధ్యలో ఆలూ మసాలా పెట్టి మడవాలి. అంతే వేడి వేడి మైసూర్ మసాలా దోశ రెడీ.

-దోశ హోటల్‌ లో లాగా మంచి ఎరుపు-బంగారు రంగులో రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా కొంచెం బొంబాయి రవ్వ కలపండి. ఇది దోశను ఎక్స్‌ ట్రా క్రిస్పీగా మారుస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, January 30, 2026, 17:05 [IST]
Desktop Bottom Promotion