తమిళనాడు స్పెషల్ దిండిగల్ చికెన్ బిర్యానీ..మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మనదేశంలో ముఖ్యంగా సౌతిండియాలో బిర్యానీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేక రుచి, తయారీ విధానం. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ పట్టణానికి చెందిన బిర్యానీ తన ప్రత్యేకమైన రుచితో చాలా ఫేమస్ అయ్యింది. దీనిని దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అని కూడా అంటారు. ఈ బిర్యానీ ఇతర బిర్యానీల కంటే భిన్నంగా ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ బిర్యానీ తయారీలో ప్రధానంగా ఉపయోగించేది సీరగా సంబా అనే చిన్న గింజలు కలిగిన సుగంధ భరితమైన బియ్యం రకం. ఈ బియ్యం దిండిగల్ ప్రాంతానికి ప్రత్యేకమైనది,దీని వలన బిర్యానీకి ఒక ప్రత్యేకమైన రుచి, ఆకృతి వస్తుంది.

ఇతర దక్షిణ భారతీయ బిర్యానీల మాదిరి కాకుండా దిండిగల్ బిర్యానీలో కారం తక్కువగా ఉంటుంది.ఈ బిర్యానీని సాధారణంగా కుక్కర్‌ లో లేదా మట్టి కుండలో దమ్ పద్ధతిలో తయారుచేస్తారు. ఇది సుగంధ ద్రవ్యాలు, మాంసం రుచి బియ్యంలోకి పూర్తిగా ఇంకిపోయేలా చేస్తుంది. దిండిగల్ చికెన్ బిర్యానీని మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

-చికెన్ - 500 గ్రాములు
-సీరగా సంబా బియ్యం - 2 కప్పులు
-చిన్న ఉల్లిపాయలు - 200 గ్రాములు
-టొమాటోలు - 2
-పచ్చిమిర్చి - 3-4
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
-పెరుగు - 1/2 కప్పు
-నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
-కొత్తిమీర - 1/4 కప్పు
-పుదీనా - 1/4 కప్పు
-నూనె లేదా నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - 4 కప్పులు
-ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1 టీ స్పూన్
-సోంపు - 1 టీ స్పూన్
-లవంగాలు - 4-5
-యాలకులు - 3-4
-దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
-నల్ల మిరియాలు - 1/2 టీ స్పూన్
-కల్పాసి (రాతి పువ్వు) - 1 చిన్న ముక్క

రాత్రి మిగిలిన అన్నంతో రుచికరమైన మంచూరియా..15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు..ఎలాగంటే..

తయారీ విధానం

-ముందుగా సీరగా సంబా బియ్యంను శుభ్రంగా కడిగి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, కల్పాసి వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసుకోవాలి.

-ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, తయారుచేసిన మసాలా పొడిలో సగం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం ఒక గంటసేపు నానబెట్టాలి.

-తర్వాత ఒక మందపాటి అడుగు కలిగిన కుక్కర్ లేదా పాత్రలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు వేసి మెత్తగా ఉడికించాక నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి 5-7 నిమిషాలు ఉడికించాలి.

-ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పొడి,కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నానబెట్టిన బియ్యం నుండి నీరు వడగట్టి చికెన్ మిశ్రమంలో వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు,నాలుగు కప్పుల నీరు పోసి ఒకసారి బాగా కలపాలి.

-కుక్కర్ అయితే మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పాత్ర అయితే మూత పెట్టి నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు, బియ్యం మెత్తగా ఉడికే వరకు తక్కువ మంటపై ఉడికించాలి.

-ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా 5-10 నిమిషాలు అలానే ఉంచాలి.

-చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి రైతాతో లేదా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవమే. అంతే దిండిగల్ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, May 15, 2025, 8:31 [IST]
Desktop Bottom Promotion