మంగళూరు స్పెషల్ పుండి..కొబ్బరి చట్నీతో తింటే అమృతమే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మంగళూరు పుండి అనేది కర్ణాటకలోని ఉడిపి-మంగళూరు ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయ అల్పాహారం. వీటిని రైస్ డమ్లింగ్స్ లేదా రైస్ బాల్స్ అని కూడా అంటారు. పుండిని సాధారణంగా ఇడ్లీ రవ్వతో లేదా బియ్యప్పిండితో తయారుచేస్తారు. పుండిని ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి ఇది నూనె లేకుండా చాలా తేలికగా ఉంటుంది. దీంతో జీర్ణం అవ్వడం సులభం. ముఖ్యంగా ఉదయం అల్పాహారానికి ఇది చాలా మంచి ఎంపిక. వీటిని సాధారణంగా కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌ తో వడ్డిస్తారు. మంగళూరు పుండి రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మంగళూరు పుండి తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఇడ్లీ రవ్వ లేదా బియ్యప్పిండి - 2 కప్పులు
-నీరు - 3 కప్పులు
-ఉప్పు - రుచికి సరిపడా
-తురిమిన కొబ్బరి - 1/2 కప్పు
-నూనె - 1 టీస్పూన్

Tasty mangalorean pundi recipe in telugu

తయారీ విధానం

-స్టవ్ మీద పెద్ద పాన్ పెట్టి నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ మంట తగ్గించి ఇడ్లీ రవ్వను లేదా బియ్యప్పిండిని వేస్తూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. రవ్వ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి.

-పిండి చిక్కబడి పాన్ కి అంటుకోకుండా ఒక ముద్దలా మారే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ దశలో పిండి గట్టిగా మారుతుంది.

-కావాలనుకుంటే ఈ దశలో తురిమిన కొబ్బరిని వేసి బాగా కలపాలి. ఇది పుండికి మంచి రుచిని ఇస్తుంది.

-పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి పాన్ పక్కన పెట్టి పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వద్దు గోరువెచ్చగా ఉండాలి.

-చేతులకు కొద్దిగా నూనె రాసుకుని గోరువెచ్చని పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. మీరు వాటిని చిన్న నిమ్మకాయ పరిమాణంలో లేదా మీ అరచేతిలో సరిపోయే పరిమాణంలో చేసుకోవచ్చు. కొన్ని చోట్ల వీటి మధ్యలో చిన్న రంధ్రం కూడా చేస్తారు.

-ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి వాటిపై పుండి ఉండలను అమర్చాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి సుమారు 10-15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అంతే పుండి రెడీ.

-పుండిని వేడివేడిగా కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా మీకు నచ్చిన పల్లి చట్నీతో వడ్డించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, June 26, 2025, 11:34 [IST]
Desktop Bottom Promotion