Just In
గణేష్ చతుర్థి 2020 : వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందామా?
వినాయక చవితి పండుగ, తేదీ, సమయం, వినాయక చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలోని నాలుగోరోజున వచ్చే చవితి నాడు వినాయక పండుగను జరుపుకుంటారు. ఈ 2020 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన అంటే శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది.
వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి విగ్రహాలకు ఆయా ప్రాంతాలను బట్టి మూడు రోజులు.. ఐదు రోజులు, తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి, అనంతరం ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.
ఈ సందర్భంగా వినాయక చవితి రోజున శుభముహుర్తం, వినాయక చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...
వినాయక శుభ ముహుర్తం..
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2020 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన వినాయక చవితి రోజున గణేశుడిని పూజించడానికి మధ్యాహ్నం 12:04 నుండి 12:54 గంటలకు అభిజిత్ ముహుర్తం ఉంది. ఈ సమయంలో గణపతి పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో వినాయక చవితి రోజున ప్రాత కాల గణేష్ స్థాపన ముహుర్తం ఉదయం 7:40 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది.
గణేశుడి చరిత్ర..
పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకు శివుడు కూడా అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీమహా విష్ణువు సహాయం కోరుతుంది.
బ్రహ్మ సహాయం..
శ్రీమహా విష్ణువు, బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకుని వాటితో గజాసరుడి ముందు ఆడిస్తారు. ఇందుకు తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా.. తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుని వస్త్రంగా ధరించమని కోరుకొని మరణిస్తాడు.
గణేష్ చతుర్థికి నైవేద్యంగా పెట్టగల ఆరోగ్యకరమైన ఆహారాలు
బాలుడి రూపాన్ని..
శివుడి రాక గురించి విన్న పార్వతీ దేవి సంతోషంతో భర్త రావడానికి ముందు అందంగా తయారయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా పెట్టి ఎవ్వరినీ రానివ్వద్దని స్నానానికి వెళ్తుంది.
ఈశ్వరుడినే ఎదురెళ్లిన బాలుడు..
ఆ సమయంలో పరమేశ్వరుడు వస్తాడు. బాలుడికి ఎంత చెప్పినా అడ్డు తప్పుకోకపోవడంతో.. తన శూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీ దేవి ఈశ్వరుడిని చూసి సంతోషిస్తుంది. అయితే అప్పుడే బాలడి ప్రస్తావన రావడంతో.. ఆ బాలుడు మన బిడ్డ అని చెబుతుంది. తనను ఎలాగైనా బతికించమని కోరుతుంది.
గజముఖంతో
అప్పుడు శివుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి బతికించాడు. అలా గజ ముఖం ఉండటం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. తన వాహనంగా అనింద్యుడు అయిన మూషికాన్ని మార్చుకున్నాడు.
గణేష్ చతుర్ధి 2020: మీ కష్ట సమయంలో ఈ గణేష మంత్రాలు చదవండి, అంతా శుభం జరుగుతుంది...
విఘ్నాలు రాకుండా ఉండేందుకు..
కొన్ని రోజుల తర్వాత దేవతలంతా కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏ దేవుడిని ప్రార్థించాలని కోరతారు. అప్పుడు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పోటీ పడతారు. అప్పుడు శివుడు ముల్లోకాల్లో పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి తిరిగి ఎవరైతే మొదట వస్తారో వారికే ఈ పదవికి అర్హులని చెబుతారు.
తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు..
అప్పుడు గజాననుడు తన బలాబలాలు తెలిసి, మీరు ఇలాంటి నిబంధన పెట్టడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి గణేశుడికో మంత్రాన్ని చెప్పి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెబుతాడు. అప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. అయితే ఈ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్లిన చోటంతా ముందుగానే గణేశుడు స్నానం చేసి వెళ్తున్నట్టుగా కనిపించేవారు.
అలా విఘ్నేశ్వరుడయ్యాడు..
అప్పుడు తిరిగొచ్చిన కుమారస్వామి అన్నగారి మహిమ గురించి తెలియకుండా ఏదో వాగాను. నన్ను క్షమించి అన్నయ్యకే ఈ పదవిని అప్పగించండి అని చెప్తాడు. అలా భాద్రపద మాసాన శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఈ పవిత్రమైన రోజున దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, ఉండ్రాళ్లు, పండ్లు, పాలు, తేనే, పానకం వంటివన్నీ సమర్పించుకుని, ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుతారు.