పెదవికి ఎంత ప్రాధాన్యమో...పాదానికీ అంతే...!

Some Easy Natural Foot Care Tips for Women.
ప్రస్తుత జనరేషన్ లో కార్పొరేట్ ప్రపంచంలో పెదవికెంత ప్రాధాన్యమో పాదానికీ అంతే. మగువల అందాలకు పాదాలిప్పుడు మెట్టినిల్లు. యవ్వన ముఖారవిందానికి కుడిఎడమల బలమంటే పాదవర్ణాలే. పెడిక్యూర్, మెనిక్యూర్ లాంటి మోడ్రన్ ఆభరణాలను ధరించిన ఇవి అడగు తీసి అడుగేస్తే చాలు అందానికి చిరునామలైపోయాయి. ఇంతటి సుకుమారపు పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కాసింత ఓర్పు, నేర్పు ఉంటే చాలు పాదాలను ఫోటో ఫ్రేముల్లా మలచుకోవచ్చు.

శీరరంలోని అన్ని భాగాలకన్నా పాదాలే ఎక్కువ నిరాదరణకు గురవుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. చూడటానికి చిన్నగా కనిపించే వీటి మీదే వాస్తవానికి భారం ఎక్కువ పడుతుంది. శరీరం బరువునంతటినీ భరించే ఈ పాదాల ప్రమేయం లేకుండా సాగదు. కూర్చోవాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా పాదాలకే ప్రథమ స్థానం. మరి ఇంత పని చేస్తున్న పాదాల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం అన్నది జవాబులేని ప్రశ్న.

ప్రతి వ్యక్తి రోజుకి ఎనిమిదివేల నుంచి పదివేల అడుగులు వేస్తాడని ఒక అంచనా. క్రీడాకారులు, డ్యాన్సర్లు ఇంకా ఎక్కువ అడుగులు వేస్తారు. రోజు మొత్తం మీద ఇంత భారం మోసే పాదాల పట్ల కాసింత జాగ్రత్త అవసరం కాదంటరా? పాదాల కోసం బ్యూటీ పార్లర్లకి వెళ్లనక్కర్లేదు. వేలు ఖర్చు చేసి సౌందర్య సాధనాలు కొనుగోలు చేయనక్కర్లేదు. ఇంట్లో వుండే వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకోవచ్చు. అవి ఎలాగంటే.....

1. ప్రతి రోజూ కనీసం పావు గంట పాటు పాదాలను గోరువెచ్చని నీటిలో వుంచాలి. తరువాత మొత్తని బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తరువాతా ఏదైనా క్రీమ్ లాంటి వాటితో సున్నితంగా మర్ధనా చేయాలి.
2. కాలి వేళ్ల మధ్య తేమ ఎక్కువ సేపు వుండకుండా జాగ్రత్త పడండి తేమ వల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాలి వేళ్ల మధ్య జీవం కోల్పోయిన చర్మం కనిపిస్తే దానికి వెంటనే తీసివేయండి
3. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు పేరిన నెయ్యి లేదా వెన్న రాసుకొని తెల్లవారి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా కొన్ని రోజలు పాటు చేసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది.
4. చేతివేళ్లకు తీసుకున్న శ్రద్ద కాలి గోళ్ల మీద తీసుకోరు. వాటిని కూడా అందంగా ట్రిమ్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే చూడడానికి అందంగా, శుభ్రంగా వుంటాయి.
5. పాదాలకు మసాజ్ మీ అంతట మీరు చేసుకునే కన్నా వేరే వారితో చేయించుకుంటే బాగుంటుంది.
6. కాలాన్ని బట్టి చలికాలం, ఎండకాలం పాదాల పగుళ్లు ఎక్కువగా వుంటాయి. ఇలాంటి సమయాలలోనే మసాజ్ అవసరం ఎక్కువ. మసాజ్ ను రోజులో ఒకటి రెండు సార్లు చేసుకుంటే బాగుంటుంది. మసాజ్ ను చేసుకున్న తర్వాత పాదాలను కదల్చకుండా వుంటే మంచిది. రాత్రి పడుకోబోయే ముందు, మధ్యాహ్నం అనువైన సమయం.
7. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు సాక్స్ ధరించడం తప్పనిసరి. ఎండ వేడిమికి పాదా త్వరగా ప్రతిస్పందిస్తాయి.
8. బిగుతుగా వుండే పాదరక్షలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కొద్దిగా వదులుగా ఉండే వాటినే ఎంపికచేసుకోవాలి. బిగుతుగా వుండేవి చమటను ఎక్కువ పట్టిస్తాయి. చమట వల్ల ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.
9. అనాసపండు ముక్కలు పాదాల పగుళ్లకు చాలా బాగా పనిచేస్తాయి. వీటి ముక్కలను పగుళ్ల మీద ఉంచి శుభ్రమైన బట్టతో రాత్రంతా కట్టి వుంచి తెల్లవారి గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్టయితే పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
10. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పెరాక్సైడ్ కలిపి అందులో కొద్దిసేపు రెండు కాళ్లను పాదాలు మునిగే వరకూ వుంచి కొద్ది సేపటి తర్వాత తీసేసి పొడి బట్టతో శుభ్రం చేసుకొంటే చక్కటి సువాసనతో పాటు మంచి ఫలితం కూడా బాగుంటుంది.

Story first published: Monday, June 11, 2012, 15:54 [IST]
Desktop Bottom Promotion