Just In
- 14 min ago 24 ఏప్రిల్ 2024: ఈ రోజు రాశి ఫలాలు మీ రాశికి ఈ రోజు ఎలా ఉంటుంది ఏ పనులు చేస్తే మంచిది ఇక్కడ తెలుసుకోండి..
- 9 hrs ago మేషరాశిలో ఏర్పడే గజలక్ష్మీ యోగం వల్ల ఏప్రిల్ 25 నుండి ఈ 3 రాశులకి పట్టిందల్లా బంగారమే..
- 9 hrs ago ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- 10 hrs ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
ఒక్క ఫోన్ చేయండి... ఉచిత భోజనం పొందండి.. మీ కడుపు నింపుకోండి...
ఒక్క ఫోన్ కాల్ చేస్తే కడుపు నిండా భోజనం గ్యారంటీ...
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బయటికి అడుగుపెడితే లాఠీలతో తమ ఒళ్లంతా ఎక్కడ పచ్చడి అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలకు భయపడి చాలా మంది తమ కడుపులు కూడా మాడ్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో విద్యార్థులను, బ్యాచిలర్స్ ను హాస్టల్ నుండి బలవంతంగా ఆంధ్రకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో పోలీసులతో బూతులు వింటూ.. తన్నులు తింటూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని.. అష్టకష్టాలు పడి అర్థరాత్రి వేళ సమయంలో సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరితే.. ఇక్కడి పోలీసులు మరో రకంగా ప్రవర్తిస్తున్నారు. తామేదో ఇతర దేశం నుండి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల తీరుతో విసిగిపోయినా కొందరు తాము కరోనా వైరస్ తో కాకుండా... మేము తిండి తిప్పలు లేక చచ్చిపోయేట్టు ఉన్నామని వాగ్వివాదానికి సైతం దిగారు. దీంతో ఆలస్యంగా స్పందించారు ఉన్నతాధికారులు. అయితే అక్కడ కూడా అన్నీ కండిషన్లే.. మీరు క్వారంటైన్ లో ఉంటామంటేనే మిమ్మల్ని అడుగుపెట్టనిస్తాం.. లేదంటే తిరిగి వెళ్లిపోండి అని చావు కబురు చల్లగా చెప్పేశారు. అయితే తెలంగాణ సర్కారు తన తప్పును తెలుసుకుని.. హస్టళ్లను తెరిపిస్తామని.. సబ్సిడీ ఫుడ్ ను ఫ్రీ సెంటర్లను రాత్రిళ్లు కూడా ఓ 50 కేంద్రాలలో తెరిచే ఉంచుతామని ప్రకటించింది... అదేంటి టైటిల్ ఏమో ఫోన్ చేస్తే కడుపు నిండా భోజనం అని పెట్టాడు.. ఇక్కడేమో అందుకు సంబంధించిన విషయమే లేదు అని అనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది... ఒక్క ఫోన్ కాల్ చేస్తే కడుపు నిండా భోజనం ఎక్కడ పెడతారో ఇప్పుడు చెబుతాను...
కమ్యూనిటీ కిచెన్లు...
కరోనా నేపథ్యంలో డబ్బులున్న వారు మార్కెట్లకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుని కడుపు నింపుకుంటున్నారు సరే. ఇదంతా బాగానే ఉంది. మరీ రోజు వారీ కూలీల పరిస్థితేంటి. వారికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అందుకే అలాంటి వారి గురించి ఆలోచించే కేరళ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదే కమ్యూనిటీ కిచెన్ల సెంటర్ ఏర్పాటు. అంటే ప్రజా వంటశాల అన్నమాట.
లాక్ డౌన్ కష్టాలు..
మొన్న ప్రధాని మోడీ ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అని ప్రకటించాడు. సరేలే ఒకరోజే కదా అని సర్దుకుపోతే.. నిన్న వచ్చి ఏప్రిల్ 15వ తేదీ వరకూ లాక్ డౌన్ అని మళ్లీ బాంబు పేల్చాడు. ఈ నేపథ్యంలో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో నివసించే వారిలో చాలా మందికి నులు లేకుండా పోయాయి. అంతేకాదు కడుపు నిండా తిండి దొరకడమే వారికి గగనమైపోయింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎక్కడికక్కడే కుక్కిన పేనల్లే ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసం పినరయ్ విజయన్ ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. అలాంటి వారందరికీ ఓ ప్రజావంటశాలను ఏర్పాటు చేసింది.
ఆకలితో అలమటించకూడదని..
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదనే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. దీని వల్ల హోం క్వారంటైనులో ఉన్నవారికి, పనులు లేని కూలీలందరికీ కొంతైనా ఊరట కలుగుతుంది. వీరు ప్రతిరోజూ ప్రజా వంటశాలలో ఎంతోకొంత ఆహారాన్ని తయారు చేస్తారు.
కాల్ చేస్తే..
ఇలాంటి వారంతా కేరళ ప్రభుత్వం ఇచ్చిన నంబర్లకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారే ఆహారాన్ని స్వయంగా హోమ్ డెలివరీ చేస్తారట. నిజానికి ఇది వారికి కొత్తేమీ కాదు. ఇటీవల భారీ వర్షాలు, విపత్తులు వచ్చిన సమయంలో చాలా గ్రామాల్లో ఇలాంటి వాటిని నిర్వహించారు. ఇప్పుడు దీనినే మరింత విస్తరించి అందరికీ ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదే పనిలో..
కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే చాలా మంది ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు ఈ పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే మనకు మధ్యాహ్న భోజన వ్యవస్థ ఉంది కాబట్టి.. ఇది పెద్ద కష్టమేమీ కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆచరణ ఎంతవరకు విజయవంతమవుతుందో తెలీదు కానీ.. వీరి ఆలోచన మాత్రం చాలా మంచిది. మనం కూడా ఇది విజయవంతమై అందరికీ కడుపు నిండా దొరకాలని మనసారా కోరుకుందాం