Just In
- 5 hrs ago గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- 5 hrs ago అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- 8 hrs ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- 10 hrs ago Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
చెత్తబుట్టలో నుంచి వచ్చిన చిన్నారి అమితాబ్ నే ఆశ్చర్యపరిచింది..
ఈ ఏడాది మే నెలలో ఆసక్తి ఉన్నవారంతా ‘కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొనవచ్చనే ప్రకటనతో పాటు ఛానెల్ నిర్వాహకులు కొన్ని ప్రశ్నలిచ్చారు. ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనే ఉద్దేశ్యంతో సమాధానాలు పంపాను.
ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ఆ మహిళ 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో పాల్గొంటుందని కలలో కూడా ఊహించలేదు. పుట్టిన వెంటనే చెత్తబుట్టలో చేరిన ఆ చిన్నారి తర్వాత అనారోగ్యాల బారిన పడింది. అంతేకాదు పక్షవాతానికి సైతం గురి అయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా విద్యను మాత్రం వీడలేదు. ఆ విద్యే ఆమెను అకస్మాత్తుగా 'కౌన్ బనేగా కరోడ్ పతి'లో బిగ్ బీ ఎదురుగా కూర్చునేలా చేసింది. అంతేకాదు అక్షరాల పన్నెండున్నర లక్షల రూపాయలను గెలుచుకుంది. అది కాస్త వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె అక్కడికి ఎలా వెళ్లింది. అక్కడ ఎందుకు ఏడ్చింది వంటి విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
''ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లోని కపూర్ పూరులో రాజ్ కుమార్ సింగ్ చౌహన్, కల్పన దంపతులకు నూపుర్ సింగ్ జన్మించింది. ఆమె పుట్టకముందే తల్లి కల్పన ముందుగానే కపూర్ పేరును రాసి పెట్టుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుందట. ఒకరోజు కల్పనకు పురిటినొప్పులు వస్తోంటే స్థానిక ప్రభుత్వాసుప్రతికి తీసుకెళ్లారు. డాక్టర్ ఏదో యాక్సిడెంట్ కేసును చూస్తుంటే, నర్సులే నూపుర్ తల్లి దగ్గర ఉన్నారట. కాన్పు సమయంలో తాను సగం మాత్రమే బయటికొచ్చానంట. అప్పటికే నేను నీలం రంగుంలో ఉండటంతో డాక్టర్ వచ్చి ఫోరెప్స్ తో నన్ను బయటకు తీశారు. నాలో ఎలాంటి కదలిక లేకపోవడంతో చనిపోయానని చెప్పి చెత్తబుట్టలో పారేశారట. ఇది తెలిసి అంతా బోరున ఏడ్చారట. పాపాయిని శుభ్రం చేసి ఇస్తే మా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసుకుంటామని చెబుతూనే మరోసారి నన్ను కదిపి చూడమని మా నానమ్మ అడిగిందట. నర్సు నా వీపు మీద తట్టేసరికి నేను ఏడవడం మొదలు పెట్టానని అమ్మ చెప్పింది. ఆ సమయంలో చేసిన వైద్యం నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంటికొచ్చి నాలుగు నెలలు గడిచినా సరైన కదలిక లేకపోవడంతో వైద్యులకు చూపించారు. వాళ్లు హైదరబాద్ తీసుకెళ్లమన్నారు. ప్రసవ సమయంలో ఫోర్సెప్స్ వాడటంతో నా మెదడుకు గాయమై, కుడివైపు పూర్తిగా పక్షవాతం వచ్చిందని తేల్చారు. నాకు నయం చేసేందుకు అమ్మ, నాన్న చూపించని డాక్టర్ అంటూ లేడు. ఆఖరికి నాలుగేళ్ల తర్వాత వాకర్ సాయంతో నడవగలిగాను.
ఎనిమిదేళ్లకు స్కూలుకు..
అప్పటి నుంచి నన్ను నానమ్మ ఇంట్లో ఉంచి చికిత్స చేయించేవారు. ఎనిమిదేళ్లకు నన్ను స్కూలుకు తీసుకెళ్తే, వికలాంగుల పాఠశాలలో చేర్పించమన్నారు. అక్కడ నా ఐక్యూ పరిశీలించిన వైద్యులు నా మెదడు ఆరోగ్యంగా ఉందని, సాధారణ పాఠశాలలో కూడా చేర్పించొచ్చని అన్నారు. దాంతో నన్ను సాధారణ స్కూల్ లో చేర్పించారు. అక్కడ ఎవరూ నాతో స్నేహం చేసేవారు కాదు. టీచర్లూ నాకు ఏం చెప్పినా అర్థం కాదనేవారు. సరిగ్గా ఆ సమయంలోనే అపర్ణాజోషి అనే టీచర్ నాకు చదువు విలువ తెలియజేశారు. నాలో ఓ ఆశయాన్ని నింపారు. ఇప్పటికీ ఆమెనే నా మెంటార్, ప్రతి క్లాస్ లోనూ ఫస్ట్ వచ్చేశా. అలా డిగ్రీలో బిఏ వరకు చదివాను. కంప్యూటర్ కోర్సులో డిప్లమో చేశా. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఓవైపు చదువుతూనే కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాను.
విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు..
ట్యూషన్ సెంటర్ కు తొలి రోజుల్లో కేవలం నలుగురు లేదా ఐదుగురు పిల్లలు మాత్రమే వచ్చేవారు. వారిని పంపేందుకు వారి తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యూషన్లు బ్యాచుల వారీగా చెప్పే స్థాయికి విద్యార్థులు పెరిగారు. గత జన్మలో ఏం పాపం చేసిందో ఈ వైకల్యం వచ్చిందని నా చిన్నప్పుడు విమర్శించిన వారంతా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.
నాకు ఏడుపొచ్చేసింది..
ఈ ఏడాది మే నెలలో ఆసక్తి ఉన్నవారంతా 'కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొనవచ్చనే ప్రకటనతో పాటు ఛానెల్ నిర్వాహకులు కొన్ని ప్రశ్నలిచ్చారు. ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనే ఉద్దేశ్యంతో సమాధానాలు పంపాను. తర్వాత టెలిఫోన్ ఇంటర్వ్యూ చేశారు. సమాధానాలిచ్చి పాసయ్యాను. లక్నోకు అడిషన్స్కి రమ్మని పిలుపు వచ్చింది. అమ్మతో కలిసి వెళ్లాను. అక్కడ కూడా అర్హత సాధించడంతో కార్యక్రమంలో పాల్గొనేందుకు విమానం టికెట్లు పంపారు. తొలి రెండు రోజులు నేను ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ టెస్టులో ఫెయిల్ అయ్యాను. అభ్యర్థులను హాట్ సీటుకు ఎంపిక చేసే టెస్ట్ అది. కుడివైపు పక్షవాతంతో ఒక్కచేత్తో వేగంగా చేయలేకపోయా. మూడో రోజున అర్హత సాధించకపోతే బయటకొచ్చేయాలి. అదే చివరి అవకాశం. పట్టుదలగా హాట్ సీటుకు చేరుకున్నాను. అమితాబ్ సార్ నా కథ విని నిల్చొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తొలి పది ప్రశ్నల వరకు వెంట వెంటనే సమాధానం చెప్పిన నేను ఆ తరువాత కొంచెం తడ్డబడ్డా పన్నెండు లక్షల రూపాయలు గెలుచుకున్నాను. అక్కడితో బయటికి వచ్చేశాను. నన్ను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని బిగ్ బి అంటుంటే నాకు ఏడుపొచ్చేసింది. స్టూడియో నుండి బయటికి వస్తున్నపుడు గతమంతా గుర్తొచ్చింది. ఇక్కడ గెలుచుకున్న డబ్బుతో కూలిపోయేలా ఉన్న మా ఇంటిని బాగు చేయించుకుంటాను. మించి ఉద్యోగం సాధించి, ఎప్పటికైనా పెద్ద ఆసుప్రతిలో వైద్యనిపుణుల దగ్గర చికిత్స చేయించుటా'' అని నూపుర్ సింగ్ చెప్పింది.