Just In
- 1 hr ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 2 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 5 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 13 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
SI Sirisha : ‘శవమైనా, శివుడైనా ఒక్కటే.. అందరికీ కనువిప్పు కలగాలనే...’
కాశీబుగ్గ ఎస్సై శిరీష గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మనలో చాలా మందికి పోలీసులంటే కఠినమైన మనస్తత్వం గలవారని, ఖాకీ డ్రస్సు వేసుకుని కర్కశంగా ప్రవర్తిస్తారనే భావన ఉంటుంది. కానీ ఖాకీ డ్రస్సు వేసుకున్న వారిలోనూ మానవత్వం, జాలి, దయ ఉన్నవారు చాలా మందే ఉన్నారు.
ఇప్పటికే చాలా మంది తామేంటో నిరూపించుకున్నారు. తాజాగా ఓ మహిళా ఎస్సై చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఓ అనాథ శవాన్ని స్వయంగా తన భుజాలపై మోసుకుంటూ దాదాపు కిలోమీటరు మేరకు నడిచారు.
తన చుట్టుపక్కల ఉండే వారు, తోటి కానిస్టేబుళ్లు కూడా ఆ శవాన్ని ముట్టుకోవడానికి నిరాకరించడంతో.. తానే ఈ పని చేయాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటనను మొత్తం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ ఒక్క వీడియో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదిలించింది.
ఆ మహిళా ఎస్సైను మనసారా అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు. దీనంతటికీ కారణం.. తను గతంలో ఎదుర్కొన్న సమస్యలే కారణమని.. తనకు శవమైనా, శివుడైనా ఒక్కటే అని చెబుతోంది ఎస్సై శిరీష. ఈ సందర్భంగా ఎస్సై శిరీష గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
మూడు రోజుల ముందు..
మూడు రోజుల ముందు వరకు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై(సబ్ ఇన్స్పెక్టర్) శరీష గురించి ఎవ్వరికి సరిగ్గా తెలియదు. ఖాకీ డ్రస్సు వెనుక తనలో దాగి ఉన్న గొప్ప మనసు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాక, ప్రతి ఒక్కరూ ఆమెకు సెల్యూట్ చేశారు. ఎందుకంటే తను చిన్నప్పుడే ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొని.. వాటితో పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
13 ఏళ్లకే పెళ్లి..
విశాఖ లోని కొత్తూరు అప్పారావు, రమణమ్మ కూలీ పనులు చేసుకునే వారికి జన్మించిన శిరీష, చిన్నప్పుడే అనేక కష్టాలను ఎదుర్కొంది. అప్పట్లో ఆడపిల్లను భావించే రోజుల్లో ఆమెను కూడా భారంగా భావించి 13 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అయితే ఆ వయసులో ఏం చేయాలో తనకు తెలియలేదు. తన భర్త వయసుకు.. తన వయసుకు అసలు పొంతన అనేదే లేదు. ఒక భార్యగా ఎలాంటి బాధ్యతలు ఉంటాయో కూడా తెలియని రోజుల్లో వివాహం జరిగింది. కానీ, చివరికి ఎలాగోలా ఆ నరకం నుండి బయటపడింది.
పుస్తకాలు కొనేందుకు డబ్బు లేదు..
అయితే ఆ నరకం నుండి బయటిపడినప్పటికీ, భవిష్యత్తు అంతా అంధకారంగానే కనిపించింది. అలా కష్టాలతో సావాసం చేయడం నేర్చుకున్న శిరీష, అప్పటి నుండి తండ్రి వద్దే ఉంటూ విద్యను కొనసాగించారు.
తండ్రి కల నెరవేర్చేందుకు..
తన తండ్రికి పోలీస్ యూనిఫామ్ అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయశాంతిలా తన కూతురిని చూడాలని కల కనేవారట. అందుకే తన పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారట. శిరీష అన్నయ్య సతీష్ కుమార్ భారత నేవీలో, తన సోదరి వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్నారు. దీంతో తాను కూడా మంచిగా చదువుకుని, మంచి పొజిషన్ లో ఉండేందుకు కష్టపడి రీ ఎంబర్స్ మెంట్ ఫీజు సాయంతో ఎం.ఫార్మసీ పూర్తి చేశారు.
తొలిసారి కానిస్టేబుల్ గా..
ఆ తర్వాత 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా శిరీష్ కు జాబ్ వచ్చింది. తండ్రి కోరిక మేరకు పోలీస్ కానిస్టేబుల్ గా మద్దిలపాలెంలో పని చేశారు. అదే సమయంలో ఓ ఉన్నతాధికారి తనను హేళన చేయడంతో అప్పటి నుండి ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలా బాధపడుతూ ఉంటే లాభం లేదనుకుని.. తనకు తానే ధైర్యం చెప్పుకుంది.
ఎగతాళి చేసిన ఎస్పీనే సన్మానం..
అయితే మరో ఉన్నతాధికారి సాయంతో తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి 8 నెలల పాటు సెలవు పెట్టేసి, జీతం లేకుండానే, అప్పటిరవకు పనిచేసినందుకు వచ్చిన లక్షన్నర రూపాయలతో అనంతపురంలో ఓ కోచింగ్ సెంటర్లో చేరారు. రెండేళ్ల పాటు కఠోర శ్రమ చేసిన తనకు 2019లో ఎస్సైగా జాబ్ వచ్చేసింది. అయితే అంతకుముందు ఎవరైతే ఎస్పీ తనను ఎగతాళి చేశారో.. అదే అధికారి విశాఖలో సన్మానం చేశారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ అన్న ఎస్పీయే సన్మానం చేయడం నా జీవితంలో మధురానుభూతి' అని శిరీష గర్వంగా చెప్పారు. ఇక అనాథ శవాన్ని మోయడం గురించి.. మాట్లాడుతూ, నాకొచ్చిన సమాచారం మేరకు.. గిరిజన ప్రాంతంలోకి వెళ్లాను. అక్కడ ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన ఓ ముసలాతని శవం కనిపించింది. చూస్తే బాగా జాలి వేసింది. కొందరు భూత, ప్రేత, పిశాచాలని, ముట్టుకుంటే స్నానం చేయాలని.. అదొక అపచారం అంటూ ఏవేవో చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలను పోగొట్టాలని, అందరికీ కనువిప్పు కలగాలని తానే స్వయంగా ఆ శవాన్ని మోసుకొచ్చానని చెప్పారు. భవిష్యత్తులో కూడా తన తండ్రి చూపిన బాటలోనే నడుస్తానని ఆమె స్పష్టం చేశారు.