బీహారీ బైంగన్ బడి.. ఒక్కసారి రుచి చూస్తే వంకాయ వద్దన్న వాళ్లే మళ్లీ కావాలంటారు!

Posted By:

బీహార్ వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది లిట్టీ చోఖా. అయితే దానికి ఏమాత్రం తీసిపోని మరొక అద్భుతమైన సంప్రదాయ వంటకం బైంగన్ బడి. వంకాయ, ఎండబెట్టిన మినప వడియాలు కలయికతో చేసే ఈ కూర కారంగా, ఎంతో రుచిగా ఉంటుంది.

వంకాయ అనగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. కానీ ఈ బీహారీ స్టైల్ బైంగన్ బడి కర్రీ రుచి చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. బీహారీ స్టైల్ వంకాయ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Bihari Style Baingan Badi Recipe in Telugu The Perfect brinjal Curry for Rice and Roti

కావలసిన పదార్థాలు
వంకాయలు- పావు కిలో
మినప వడియాలు- ఒక కప్పు
ఆవ నూనె - తగినంత
ఆవాలు - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6 నుండి 8
పచ్చిమిర్చి, ఎండుమిర్చి - రుచికి తగినన్ని
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పసుపు - పావు టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా వంకాయలను మీడియం సైజు ముక్కలుగా కోసి ఉప్పు వేసిన నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల వంకాయ నల్లబడకుండా, చేదు రాకుండా ఉంటుంది.

-స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆవ నూనె వేడి చేయాలి. అందులో మినప వడియాలను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించిన ఈ వడియాలను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే వడియాలు మెత్తబడి, కూరలో త్వరగా ఉడుకుతాయి.

-అదే పాన్‌ లో మరికొద్దిగా ఆవ నూనె వేసి, మెంతులు వేయాలి. మెంతులు చిటపటలాడాక వంకాయ ముక్కలు వేసి సగం ఉడికే వరకు వేయించుకుని, పక్కన ప్లేట్‌ లోకి తీసుకోవాలి.

-ఇప్పుడు అసలైన బీహారీ మసాలా సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ ‌లో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-పాన్‌ లో మళ్లీ కొద్దిగా నూనె వేడి చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆవాల మసాలా పేస్ట్, టమాటో ముక్కలు వేసి కలపాలి. టమాటాలు మెత్తబడి మసాలాలో నుంచి నూనె పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలి.

-మసాలా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన వడియాలు (నానబెట్టిన నీటితో సహా) వేయాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

-గ్రేవీకి తగినట్లుగా అవసరమైతే మరో అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సన్నని మంట మీద పది నిమిషాల పాటు ఉడికించాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ వంకాయకు, వడియాలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే ఘుమఘుమలాడే బీహారీ బైంగన్ బడి కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా లేదా వేడివేడి చపాతీలు, రోటీలతో తిన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, February 23, 2026, 11:25 [IST]
Desktop Bottom Promotion