కర్ణాటక స్టైల్ ఉప్మా,నీరు చట్నీ..ఈ టేస్ట్ వేరే లెవెల్ బాసూ..

Posted By:

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తోందా? రోజూ తినే ఇడ్లీ, దోశలు లేదా పొడిపొడిగా ఉండే ఉప్మా తిని మీకు విసుగు వచ్చిందా? అయితే ఈ రోజు మీ వంటింట్లో ఒక చిన్న మార్పు చేసి చూడండి. అయితే కర్ణాటక స్పెషల్ రవ్వ ఉప్మా, తన్ని చట్నీ (నీళ్ల చట్నీ) కాంబినేషన్ ట్రై చేయండి.

మనం చేసుకునే సాధారణ రవ్వ ఉప్మానే కొంచెం వైవిధ్యంగా, కర్ణాటక శైలిలో చేస్తే దాని రుచే వేరు. అందులోనూ ఆ ఉప్మాలో ఈ పలచటి చట్నీని పోసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది. మరి నోరూరించే ఈ బ్రేక్‌ ఫాస్ట్ కాంబోని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Bored of Idli Dosa Try This Karnataka Style Upma and Watery Chutney Combo Recipe in Telugu

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ: అర కప్పు
నీళ్లు: 3 కప్పులు
నూనె: 2 టీస్పూన్లు
నెయ్యి: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు, శనగపప్పు, పల్లీలు: ఒక్కోటి 1 టీస్పూన్ చొప్పున
కరివేపాకు: 1 రెమ్మ
ఉల్లిపాయ: 1 పెద్దది
పచ్చిమిర్చి: కారానికి తగినట్లు
అల్లం తురుము: కొద్దిగా
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
చక్కెర: అర టీస్పూన్
కొత్తిమీర: గార్నిష్ కోసం
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు
జీడిపప్పు (లేదా వేయించిన శనగపప్పు): పావు కప్పు
అల్లం: చిన్న ముక్క
చింతపండు: చిన్న రెమ్మ
కొత్తిమీర, ఉప్పు: తగినంత
పోపు కోసం: నూనె, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్‌ లో ఒక చెంచా నూనె వేసి వేడెక్కాక, రవ్వను వేయండి. మీడియం మంటపై రవ్వ మంచి సువాసన వచ్చేంతవరకు, లేత రంగు మారేంతవరకు వేయించి పక్కన పెట్టుకోండి.

-అదే పాన్‌ లో నూనె వేడి చేసి ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, వేరుశనగలు, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. పప్పులు వేగాక అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి మెత్తబడి పారదర్శకంగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.

-నీళ్లు తెర్లుతున్నప్పుడు మంట తగ్గించి, వేయించి పెట్టుకున్న రవ్వను నెమ్మదిగా పోస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఒక చెంచా నెయ్యి, అర చెంచా చక్కెర వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి, మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. కాసేపు మగ్గనివ్వండి.

-మిక్సీ జార్‌ లో కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. చివరగా నూనెలో ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని చట్నీలో కలుపుకోవాలి.

-ప్లేట్ నిండా వేడి వేడి ఉప్మా వడ్డించుకుని, దానిపై ఈ పలచటి చట్నీని ఉదారంగా పో పోసుకుని కలిపి తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, February 12, 2026, 6:50 [IST]
Desktop Bottom Promotion