మైసూర్ బోండా కాదు.. ఈ ఆలూ మైసూర్ బోండాను ఎప్పుడైనా తిన్నారా..?

Posted By:

టిఫిన్‌లో మెత్తని మైసూర్ బోండాలను చట్నీలోకలుపుకొని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. అదే మైసూర్ బోండాలో ఆలూనూ మిక్స్ చేసి బోండాలు చేస్తే అదే ఆలూ మైసూర్ బోండా. ఈ ఆలూ మైసూర్ బోండాలు మనకు బయట ఎక్కువగా దొరకదు. ఈ ఆలూ మైసూర్ బోండా చాలా టేస్టీగా వుంటుంది. మీకోసం ఆలూ మైసూర్ బోండా రెసిపీని తీసుకొని వచ్చాము. కేవలం ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే సింపుల్‌గా చేసేయొచ్చు.

ఆలూ మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు

5 పచ్చిమిరపకాయలు
1 అంగుళం అల్లం ముక్కలు
1 మీడిసైజు ఆలుగడ్డ
1 కప్పు పెరుగు
ఉప్పు
అర టీ స్పూన్ జిలుకర
కరివేపాకులు
1/4 టీ స్పూన్ వంట సోడా
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
ఒకటిన్నర కప్పు మైదా పిండి
1/2 కప్పు బియ్యం పిండి
1/2 కప్పు పచ్చి కొబ్బర
1/2 కప్పు చెనగపప్పు
4 వెల్లుల్లిపాయలు
1/2 టీ స్పూన్ జిలుకర
కొన్ని కొత్తిమీర ఆకులు
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
ఆవాలు, ఇంగువ, కరివేపాకులు
ఆలూ బోండాలు ఫ్రై చేయడానికి మంచి నూనె

ఆలూ మైసూర్ బోండా తయారీ విధానం

1. మిక్సీ గ్రైండర్‌లో 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్కలు, ఒక మీడియం సైజు ఆలుగడ్డను ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేయాలి.

2. గ్రైండ్ చేసిన ఆలూ పేస్టులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అర టీస్పూన్ జిలుకర, సన్నగా తరిగిన కరివేపాకులను, పావు టీస్పూన్ వంటసోడా వేసుకొని బాగా కలపాలి

3. టేబుల్ స్పూన్ ఆయిల్‌ను కూడా వేసుకొని బాగా కలపాలి

4. అందులోనే ఒకటిన్నర కప్పు మైదా పిండిని, అర కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి.

5. మైసూర్ బోండాకు పిండిని ఎలా కలుపుతామో అలాగే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి.

6. పిండిని బాగా బీట్ చేస్తూ కలిపిన తరువాత ఒక గంట వరకు అలాగే వదిలి వేయాలి.

7. చట్నీ చేయడానికి మిక్సీ గ్రైండర్‌లో అరకప్పు పచ్చి కొబ్బరిముక్కలను వేసుకోవాలి. అరకప్పు చెనగపప్పును యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయ ముక్కలను తీసుకోవాలి.

8. అదే మిక్సీ జార్‌లో 4 వెల్లుల్లిపాయను, అరటీస్పూన్ జిలుకరను, రుచికి సరిపడ ఉప్పును, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి.

9. చట్నీ ఎంత చిక్కగా వుండాలనుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్లను పోసుకొని మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.

10. ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ మంచి నూనెను పోసి వేడయిన తరువాత ఆవాలు, ఇంగువ, కరివేపాకులను వేసి పోప్ చేసుకొని చట్నీలో కలుపుకోవాలి.

11. ఆలూ బోండాలు వేయడానికి కడాయిలో తగినంత ఆయిల్‌ను పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేడిచేయాలి.

12. బోండాలను కాగిన ఆయిల్‌లో వేసుకోవాలి. బోండలు మాడిపోకుండా, పచ్చిగా ఫ్రై కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.

13. ఫ్రై అయిన బోండాలను ఒక ప్లేట్‌లో తీసుకుంటే ఇక ఆలూ బోండా, చట్నీ రెడీ అయినట్టే.

[ of 5 - Users]
Story first published: Sunday, June 16, 2024, 10:48 [IST]
Desktop Bottom Promotion