కరీంనగర్ స్పెషల్ పుంటికూర మటన్.. ముక్క తింటే నోట్లో కరిగిపోతుంది.. ఎలా చేసుకోవాలో చూడండి!

తెలంగాణ‌లో నాన్ వెజ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముక్క లేనిదే చాలా మందికి ముద్ద కూడా దిగదు. తెలంగాణ మటన్‌కు చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే కరీంనగర్ వంటి ప్రాంతాల్లో పుంటికూర మటన్ చేసుకుంటుంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా. అయితే ఈ పుంటికూర మటన్‌ను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పుంటికూర మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. మటన్
  2. నాలుగు బడా ఇలాచీ
  3. పది ఏలకులు
  4. పది లవంగాలు
  5. దాల్చిన చెక్క
  6. మూడు బిర్యానీ ఆకులు
  7. కొత్తిమీర
  8. పుదీనా
  9. నూనె
  10. గోంగూర(పుంటికూర)
  11. అల్లం
  12. వెల్లుల్లి
  13. టమాటోలు
  14. పచ్చిమిర్చి
  15. కొబ్బరి పొడి
  16. ధనియాల పొడి
  17. పసుపు
  18. కారం
  19. రుచికి సరిపడా ఉప్పు
  20. ఉల్లిపాయలు

తయారీ విధానం

కరీంనగర్ స్పెషల్ పుంటికూర మటన్ తయారు చేసుకోవడానికి ముందు గోంగూరను శుభ్రంగా కద్దుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మటన్ కూడా శుభ్రంగా కడుక్కొని ఓ పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నూనె పోసుకోవాలి. నూనెమ్ కూసింత ఎక్కువగానే పోసుకోవాలి.

నూనె వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తరువాత అందులోనే గోంగూర వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. పుంటికూర అదే గోంగూర కొంచెం మగ్గిన తరువాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత పుంటికూర మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిని పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు మరో పాత్ర తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేగినంక అందులో బిర్యానీ మసాలాలతో పాటు బడా ఇలాచీలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్‌లో వచ్చిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్, రెండు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. అలాగే మటన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.

అలాగే అందులోనే పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఆ తరువాత మూత తీసి, దాంట్లోనే కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని.. మటన్ ముక్కలు 70 శాతం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు 70 శాతం ఉడికిన తరువాత కారం పొడి వేసుకోవాలి. ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు నీళ్లు కూడా కలుపుకొని, ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోవాలి.

ఆ తరువాత మటన్ కూరను ఇంకో అయిదు నిమిషాల పాటు హై మంట మీద ఉడికించుకోవాలి. ఆ తరువాత మటన్ కూరలో కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకొని కిందకు దించుకుంటే కరీంనగర్ స్పెషల్ పుంటికూర మటన్ సిద్ధమైనట్లే. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, December 15, 2024, 14:30 [IST]
Desktop Bottom Promotion