నెల్లూరు స్పెషల్ మసాలా వడ పులుసు..చేపల పులుసుని మరిపించే రుచి

Posted By:

నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో, శాకాహారులకు అంతే అద్భుతమైన రుచిని ఇచ్చే వంటకం మసాలా వడల పులుసు. అన్నంలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. నెల్లూరు స్పెషల్ మసాలా వడల పులుసు కేవలం నాలుకను తృప్తి పరిచే వంటకం మాత్రమే కాదు, పోషకాల గని కూడా.

పప్పుల ద్వారా వచ్చే ప్రోటీన్, మసాలా దినుసుల ద్వారా వచ్చే ఔషధ గుణాలు దీనిని ఒక పరిపూర్ణమైన ఆహారంగా మారుస్తాయి. మీ ఇంట్లోనే ఈజీగా నెల్లూరు స్టైల్ లో మసాలా వడ పులుసు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Step by Step Guide to Making the Famous Nellore Masala Vada Pulusu Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-సోంపు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-పచ్చిశెనగపప్పు
-చింతపండు
-కారం
-పసుపు
-ధనియాల పొడి
-అల్లం
-వెల్లుల్లి
-టమాటో
-కరివేపాకు
-కొత్తిమీర
-నూనె
-ఆవాలు
-మెంతులు
-ఉల్లిపాయ

Step by Step Guide to Making the Famous Nellore Masala Vada Pulusu Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా వడలు చేసుకోవాలి.ఇందుకోసం పచ్చి శెనగపప్పును 3-4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత నీటిని వంపేసి మిక్సీ గిన్నెలో నానిన పచ్చి శెనగపప్పు వేసి, కొంచెం నీళ్లు పోసుకొని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు రోట్లో ఒక టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ కల్లు ఉప్పు వేసి బాగా నూరాలి. సోంపు కచ్చాపచ్చాగా నలిగిపోయాక దీనిని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు రోట్లో ఒకటిన్నర ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచి ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బరకగా గ్రైండ్ చేసుకున్న శెనగపప్పు ముద్ద, దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, దంచుకున్న సోంపు, పావు కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి సన్నని తరుగు, పావు టీస్పూన్ పసుపు, తుంపిన 1 రెబ్బ కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.

-కలుపుకున్న పిండిని ఉసిరికాయ సైజులో ఉండలుగా చేసి తర్వాత వాటిని అరచేతిలో పెట్టుకొని రెండు చేతులతో ఒత్తితే చిన్న వడ ఆకారంలోకి వస్తుంది. అన్నింటిని ఇలా చేసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక వడలను ఒకదాని తర్వాత ఒకటి వేసి కదపకుండా 1 నిమిషం పాటు వదిలేయాలి. తర్వాత గరిటతో తిప్పుకుంటూ రెండువైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యేవరకు మీడియం మంట మీద కాల్చి స్టవ్ ఆపేసి వడలను ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు పులుసు తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి.

-వేడెక్కిన నూనెలో రెండు చిటికెళ్ల మెంతులు వేసి ఎర్రగా వేపాక ఇందులో అర టీస్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. తర్వాత కరివేపాకు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు వేసి వేపాలి.

-వెల్లుల్లి మెత్తబడ్డాక అందులో అరకప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ముక్కలు మెత్తబడేదాకా వేపాలి. తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద టమాటోల సన్నని తరుగు, పావు టీస్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి టమాటోలు గుజ్జుగా అయ్యేంతవరకు మూతపెట్టి మగ్గించాలి. దీనికి 4-5 నిమిషాల టైం పడుతుంది.

-మగ్గిపోయిన టమాటోలలో 2 టీస్పూన్ల ధనియాల పొడి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసి వేపాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు నుంచి తీసిన 600 ఎమ్ఎల్ చింతపండు పులుసు స్టవ్ మీద గిన్నెలో పోసి కలిపి మీడియం మంట మీద 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి.

-బాగా మరిగిన పులసులో సిద్దం చేసుకున్న మసాలా వడలు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. అంతే నెల్లూరు స్పెషల్ మసాలా వడల పులుసు రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, November 24, 2025, 8:52 [IST]
Desktop Bottom Promotion