Just In
మూషికాలయం : 20 వేల ఎలుకలున్న దేవాలయంలో ఎన్నో వింతలు గురించి విన్నారా?
ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు... వేల సంఖ్యలో ఎలుకలు... గుంపులు గుంపులుగా ఎలుకలు.. ఎవరి పాదాల మీదుగా ఆ ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఎలుకలు ఉన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు.. ఇలా ఎన్నో వింతలు గల ఈ ఆలయానికి వెళ్లొద్దాం రండి...
ప్రముఖ ఆలయాల్లో... తప్పకుండా రుచి చూడాల్సిన మహా ప్రసాదాలు..!!
1. పాలరాతి గోడలు.. వెండి ద్వారాలు...
హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాతగా కొలుస్తారు. సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది.
2. మొఘలుల శిల్పకళానైపుణ్యం
జోధ్పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి.
ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి.
3. ఈ ఆలయంలో దాదాపు 20వేలకు పైగా ఎలుకలున్నాయి..
ఈ ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా ఆ గ్రామస్థులు పూజిస్తారట. భక్తుల రాకపోకలకు ఏమాత్రం జంకకుండా అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భక్తుల పాదాల మీదుగా పరుగులు తీస్తుంటాయి. భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి.
4. కథలకు నెలవు కర్ణిమాత
కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట.
ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
5. ఆలయం వద్ద దాదాపు 20 వేల ఎలుకలు తిరుగాడుతుండటం వెనక మరో జానపద కథ కూడా వినిపిస్తుంది.
20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఆ ప్రాంతానికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు. ఇక్కడ ఎలుకల రెట్టలు గానీ, వాటి నుంచి ఎటువంటి వాసన కూడా రాకపోవడం విచిత్రం.
ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు. ఇక్కడ ఎలుకలు ఆహార పదార్థాలను తినడం ఎక్కువ గౌరవంగా భావిస్తారు
6. తెల్లని ఎలుకలు దేవతాస్వరూపాలు...
వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట.
ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.
7. వెండి ఎలుక
ఎలుకలకు ఆహారం ఇవ్వడం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు. అయితే, ఈ ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువు గల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచుతారు.